సిటీబ్యూరో/మేడ్చల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నియమ నిబంధనలకు విరుద్ధంగా దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లను నడపడమే కాకుండా రోగులను రాబందుల్లా దోచుకుంటున్న ప్రైవైటు దవాఖానలపై వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. వైద్యాధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రైవేటు దవాఖానల లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిబంధనలు పాటించకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గత మూడు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో కొన్ని గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, నియమ నిబంధనలు పాటించని దవాఖానల బాగోతం బయట పడుతున్నది. ఈ క్రమంలో ఇప్పటి వరకు గ్రేటర్, శివారు ప్రాంతాల్లో కలిపి మొత్తం 272 ప్రైవేటు హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. అందులో సరైన అనుమతులు, గుర్తింపులేని 10 దవాఖానలను సీజ్ చేసినట్లు గ్రేటర్ వైద్యాధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించని మరో 43 దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్ద సంఖ్యలో ఏడు దవాఖానలను సీజ్ చేశారు. ఈ తనిఖీలు మరో వారం పాటు కొనసాగనున్నట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్ జిల్లా పరిధిలో..
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 115 ప్రైవేటు దవాఖానల్లో తనిఖీలు జరిపారు. గుర్తింపు లేని మూడు దవాఖానలను సీజ్ చేయగా.. నిబంధనలు పాటించని 36 దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
జిల్లా పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 110 దవాఖానల్లో తనిఖీలు చేయగా.. అందులో ఎలాంటి గుర్తింపు లేకుండా నడుస్తున్న ఏడు ప్రైవేటు హాస్పిటల్స్ను సీజ్ చేశారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో..
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తం 47 దవాఖానల్లో తనిఖీలు చేయగా.. ఏడు దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.