సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘పోలీసులు ముందుగా తమను తాము రక్షించుకున్నప్పుడే ప్రజలను రక్షించగలుగుతాం. అప్పుడే పోలీసులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది’ అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సోమవారం కమిషనరేట్లోని సీటీసీ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘డిఫెన్సివ్ ట్యాక్టికల్’ శిక్షణ కార్యక్రమాన్ని చైన్స్నాచర్ల చేతిలో కత్తిపోట్లకు గురైన కానిస్టేబుల్ యాదయ్య చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీసులు తరుచూ దుండగుల చేతుల్లో గాయాలపాలవడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం వంటి దుర్ఘటనలు చూశామన్నారు.
ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్లో పోలీసులకు “డిఫెన్సివ్ ట్యాక్టికల్’ శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. తాను ఐదేండ్ల క్రితం సైబరాబాద్లో జాయింట్ సీపీగా పనిచేసిన సమయంలోనే ఈ శిక్షణ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఈ “డిఫెన్సివ్ ట్యాక్టికల్’ శిక్షణను సైబరాబాద్కే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారన్నారు. ఇటీవల సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యాదయ్య దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ ట్యాక్టికల్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఎవరైనా మనపై దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, దుండగులపై ప్రతిదాడి ఎలా చేయాలనే మెళకువలను ఈ ట్యాక్టికల్ శిక్షణలో నేర్పిస్తారని అన్నారు. ట్యాక్టికల్ శిక్షకుడు నిశ్చల్ మాట్లాడుతూ 2016లో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ శిక్షణలో పోలీసులకు ఒక క్రమ పద్ధ్దతిలో శాస్త్రీయ పద్ధతిలో ఫ్రిస్కింగ్, చెకింగ్, డిఫెన్సివ్ టెక్నిక్స్ను నేర్పిస్తామన్నారు. ఈ ట్రిక్స్ను పోలీసులు నిరంతరం అభ్యసనం చేయడం ద్వారానే వాటిని ఉపయోగించే వీలుంటుందన్నారు. కొన్ని సంఘటనలను తాము కేస్ స్టడీగా తీసుకుని వాటి నుంచి కొన్ని మెళకువలు నేర్చుకుని, వాటిని తదుపరి వచ్చే బ్యాచ్లకు నేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, సీసీఎస్ ఏడీసీపీ నరసింహారెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, ఏసీపీ మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.