సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పబ్బుల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. పబ్బుల నిర్వహణపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాల నేపథ్యంలో నియమ, నిబంధనలపై అవగాహన కల్పించే క్రమంలో శనివారం పబ్బుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నిర్వాహకులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అందులో భాగంగా రాత్రి 10దాటిన తరువాత పబ్బుల్లో సౌండ్ను ఆపేయాలని ఆదేశించారు. నిబంధనలకు లోబడి పబ్బులను నడపాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రతి పబ్బులో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫీడ్ పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పబ్ ఉన్న ప్రాంగణాన్ని సౌండ్ ప్రూఫ్ చేయడానికి, వాలెట్ డ్రైవర్లను, సిబ్బంది, కస్టమర్లను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాలని సూచించారు. పబ్బులు ఉన్న ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.
పబ్ మేనేజర్పై కేసు
రాత్రి పది తర్వాత పబ్స్లో మ్యూజిక్కు అనుమతించొద్దన్న ఆదేశాలను జూబ్లీహిల్స్ పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. పీఎస్ పరిధిలోని 28 పబ్స్పై నిరంతరం నిఘా పెడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.59లో నివాస ప్రాంతాల మధ్య ఉన్న అబ్సార్బ్ పబ్లో తనిఖీలు నిర్వహించారు. నిర్దేషించిన సమయం దాటినా మ్యూజిక్ను నడిపిస్తుండటంతో మేనేజర్ కమల్పై కేసు నమోదు చేశారు.