Traffic challan | మీకు ట్రాఫిక్ చలానా విధించారేమో చెక్ చేసుకోండి.. అలాంటివి ఉంటే వెంటనే చెల్లించండి. లేదంటే అవి అదనపు భారంగా మారే అవకాశం ఉంది. కొందరు.. ట్రాఫిక్ ఉల్లంఘనలు పక్కాగా పాటిస్తారు..మరికొందరేమో తప్పు చేసినా..మరోసారి చేయకుండా జాగ్రత్త పడుతారు. అంటే ఒక్కసారి చలాన్ పడితే..ఇంకోసారి పడకుండా చూసుకుంటారు. ఇంకొందరు మాత్రం ట్రాఫిక్ రూల్స్ పదేపదే ఉల్లంఘిస్తారు. పైగా పెండింగ్ చలాన్లు కట్టకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు ఝలక్ ఇస్తున్నారు. మూడు నెలల్లో రెండు, మూడు ఉల్లంఘనలకు పాల్పడితే రెండింతలు, మూడింతలు జరిమానాలు విధిస్తున్నారు.
ఈ తరహా జరిమానాలను తీవ్రమైన ఉల్లంఘనలకు వర్తించే విధంగా ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటి వాటికి విధిస్తున్నారు. ఇందులో ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన జరిమానా ఉంటుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్లో ద్విచక్రవాహనానికి రూ. 200, కారుకైతే రూ. వెయ్యి ఫైన్ విధిస్తారు. ఇలా మోటార్ వాహనాల చట్టంలో ఉన్న కీలక సెక్షన్లను ఉపయోగించి ఈ జరిమానాలను విధిస్తారు.
రహదారులపై ఇష్టానుసారంగా కొందరు వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ఇతర వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ అంశంపై దృష్టి పెట్టిన నగర ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్లపై కొరడా ఝళిపిస్తున్నారు. తొలుత రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను తొలిగిస్తున్నారు. దీంతో పాటు పార్కింగ్ సదుపాయాలు లేకుండా రహదారులపై వ్యాపారాలు నిర్వహించే సంస్థలకు సూచనలు చేస్తున్నారు. 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అనంతరం వాహనదారులతో పాటు ఆయా సంస్థల బాధ్యులు, భవన యజమానులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారుడికి రూ. 100 జరిమానా విధిస్తారు. ఇది ఆ వాహనదారుడు వెంటనే చెల్లించుకోవాలి. కట్టకుండా మరో వారం పది రోజుల్లో ఇంకోసారి నిబంధన అతిక్రమిస్తే.. మొదటిది రూ. 100తో పాటు రెండో సారి తప్పు చేస్తే.. రూ. 200 వేస్తారు. మొదటి రెండు జరిమానాలు చెల్లించకుండా మరో 15 రోజుల్లో ఇంకోసారి ఉల్లంఘిస్తే.. ఆ మూడు వందలతో పాటు రూ. 100, చట్టాన్ని గౌరవించడం లేదనే కారణంతో మరో రూ. 500 జరిమానా విధిస్తారు. అంటే సదరు వాహనదారుడు మొత్తం రూ. 900 కట్టాల్సి ఉంటుంది. మూడు నెలల కాలపరిమితికే ఈ జరిమానాలు పరిమితం చేశారు. వాహనదారుడు మొదటి చలాన్ చెల్లించిన తరువాత, ఇంకో ఉల్లంఘనకు పాల్పడితే, ఆ ప్రక్రియలో జరిమానాలు వర్తించవు. అందుకే ఎప్పటికప్పుడు చలాన్లు క్లియర్ చేసుకోవడం ఉత్తమం, ఒక చలాన్ పడగానే అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం.
నగరంలోని అనేక వ్యాపార సంస్థలకు తగిన పార్కింగ్ సౌకర్యాలు లేవు. మరికొన్ని వ్యాపార సంస్థలు తమ వినియోగదారులతో పాటు వ్యాపారుల వాహనాలను పార్కు చేసేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సెల్లార్లు ఏర్పాటు చేసినా..కొందరు వాటిని ఉపయోగించకుండా రోడ్లపై తమ బండ్లను నిలుపుతున్నారు. దీనివల్ల అటు పాదచారులతో పాటు, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. అక్రమ పార్కింగ్ వ్యవహారంపై నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 21: కోఠి బ్యాంక్ స్ట్రీట్లో ఓ మహిళ హల్చల్ చేసింది. నో పార్కింగ్ స్థలంలో కారును నిలుపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇన్స్పెక్టర్ పద్మ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఓ హోటల్ సమీపంలో కాకినాడకు చెందిన దివ్య ఆమె భర్త తమ కారును నో పార్కింగ్ స్థలంలో నిలిపారు. నిత్యం రద్దీ ప్రాంతం కావడంతో కారును తీయాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పినా.. వారు వినలేదు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రావణ్కుమార్, కానిస్టేబుళ్లు ఆ కారును లాక్ చేశారు. ఆగ్రహించిన దివ్య ట్రాఫిక్ పోలీసులపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా వారి చేతిలోని వాకీటాకీని లాక్కొని తమ కారును ఎలా లాక్ చేస్తారని వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కారును సీజ్ చేశారు. దర్యాప్తు చేపట్టారు.