కీసర, సెప్టెంబర్ 21 : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, కిడ్నీ బాధితులు, గీత కార్మికులకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల ద్వారా వారి జీవితాలకు భరోసాగా నిలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేసి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంటున్నారు. ఆసరా పథకాన్ని అమలు చేసి నెలకు రూ.200 ఉన్న పింఛన్లను రూ.2016, రూ. 3016 వరకు పెంచి ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాల్లో వేసి ఆదుకుంటూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. పింఛన్ల లబ్ధిదారులందరూ సీఎం కేసీఆర్ను వారి కుటుంబ పెద్ద కొడుకుగా భావించి దీవెనలు అందిస్తున్నారు. మండలంలో మొత్తం 10 పంచాయతీలకు గాను గతంలో వృద్ధులు 677, వితంతువులు 1070, వికలాంగులు 440 వరకు పింఛన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈనెల 1వ తేదీన మండలంలోని మొత్తం 10 పంచాయతీలకు గాను మొత్తం 949 పింఛన్లను అదనంగా మంజూరయ్యాయి. వీటితో కలిపి మొత్తం కీసర మండలానికి ప్రభుత్వం నుంచి ఆసరా ద్వారా సుమారు రూ.90లక్షల వరకు ఆసరా స్కీంతో నిరుపేదల జీవితాల్లో భరోసాను
నింపుతుంది.
మండలంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వపరంగా ఆసరా పింఛన్లను ఇస్తున్నాం. గతంలో సుమారు 2319 పింఛన్లు ఉంటే మళ్లీ కొత్తగా 949 లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం. అర్హులైన వారందరికీ గ్రామాల వారీగా పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులను పంపిణీ చేశాం. ఒక్క నెలకు కీసర మండలానికి ఆసరా ద్వారా సుమారు రూ.90లక్షల వరకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి పింఛన్లు అందుతున్నాయి.
– పద్మావతి, కీసర ఎంపీడీవో
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుంది. గ్రామాల్లోని ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఇస్తుంటే లబ్ధిదారులందరూ సీఎం కేసీఆర్ను దీవిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి చొరవతో మండలంలోని 10 పంచాయతీల్లో దరఖాస్తు చేసుకొన్న వారందరికీ పింఛన్లు వచ్చాయి. ప్రభుత్వ హయాంలో పింఛన్లదారులు చాలా సంతోషంగా ఉన్నారు.
– ఇందిరలక్ష్మీనారాయణ, కీసర ఎంపీపీ
సీఎం కేసీఆర్ చల్లంగా ఉండాలే. బతుకుదెరువు లేనివాళ్లకు ఆసరాగా నిలిచి పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నాడు. దిక్కులేని వారికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద దిక్కు అయింది. మన సీఎం కేసీఆర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం.
– కాంతమ్మ, వృద్ధురాలు , యాద్గార్పల్లి