మియాపూర్, సెప్టెంబర్ 20 : పెద్ద కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలోనే కాకుండా పేదలు నివసించే బస్తీలలోనూ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుండటం అభినందనీయమని విప్ గాంధీ అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో బస్తీల్లో నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ధరణీనగర్లో రూ.2.75 లక్షలతో ఏర్పాటు చేసుకున్న 17 సీసీ కెమెరాలను కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, సీఐ సైదులు, ఎస్ఐ యాదగిరిలతో కలిసి విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తగు ఆర్థికసాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు తగు నిధులను సైతం మంజూరు చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నదని విప్ గాంధీ అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలలో చైతన్యానికి పోలీసు శాఖ కృషి అభినందనీయమన్నారు. వర్షాలకు తరచూ ముంపునకు గురయ్యే ధరణినగర్కు నాలా విస్తరణతో శాశ్వత పరిష్కారం చూపినట్లు విప్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, శ్రీనివాస్యాదవ్, గణేశ్, కాశీనాథ్, పోశెట్టి, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు రాజాబాబు, మల్లిఖార్జున్, గోపాల్, రాజు, రహమాన్, శ్రీనివాస్, నర్సిరెడ్డి, నాగరాజు, ప్రసన్న, శ్రీదేవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ముంపు సమస్య పరిష్కారానికే నాలా విస్తరణ..
ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులను చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుంచి దీప్తీశ్రీనగర్ నాలా వరకు (వయా జాతీయ రహదారి 65) రూ.15.88 కోట్ల వ్యయంతో 2.4 కిలో మీటర్ల మేర మదీనగూడలోని రామకృష్ణ నగర్లో చేపట్టనున్న నాలా విస్తరణ పనులను మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మక నాలా అభివృద్ధి పనుల్లో భాగంగా ఈర్ల చెరువు నుంచి మొదలు కొని దీప్తిశ్రీ నగర్ నాలా వరకు నాలా విస్తరణ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, జంక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాలా విస్తరణపై ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. అనంతరం రామకృష్ణ నగర్ వాసులు కాలనీలో నెలకొన్న సమస్యలను విప్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. నాలా విస్తరణ పనులు పూర్తి కాగానే అవసరమున్న చోట డ్రైనేజీ, తాగునీటి లైన్లు ఏర్పాటు చేసి తదనంతరం రోడ్ల పనులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.