సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ): పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చు. కానీ పనులు చేయాలంటే నిధులు కావాలి. తెలంగాణ ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకు ఓర్చి మూసీ సుందరీకరణ కార్యాచరణను దిగ్విజయంగా అమలు చేస్తున్నది. మరి కేంద్రంలోని బీజేపీ సర్కారేమో ప్రాజెక్టులు మంజూరు చేయదు. తెలంగాణ బీజేపీ నేతలు… అందునా కేంద్రమంత్రి హోదాలో ఉన్న కిషన్రెడ్డి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ పైసా నిధులు ఢిల్లీ నుంచి తీసుకురారు. కానీ హైదరాబాద్ గల్లీలో మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ పరిధిలో సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలోనూ ఇదేరీతిన బొంకారు. ‘మూసీ రూపాయి బిళ్ల వేస్తే కనిపించేలా చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు అంటూ మాట్లాడటం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి… కేంద్రం నుంచి రూపాయి నిధులు తేవడం చేతగాని బండికి రూపాయి బిళ్ల గురించి మాట్లాడే నైతికత ఉందా? అని జనం ప్రశ్నిస్తున్నారు.
మూరెడు పనులకు బారెడు ప్రచారం..
వినేవాళ్లుంటే… చెప్పేవాళ్లు బీజేపీ నేతలట! బండి యాత్రలోని ప్రసంగాల తీరు కూడా ఇట్లనే తయారైంది. హైదరాబాద్ మహా నగరంలో కేంద్రం నిధులతో తెలంగాణ ప్రభుత్వం ఫ్లైఓవర్లు నిర్మిస్తుందని నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రూ.1523 కోట్ల కేంద్ర నిధులతో నగరంలో చేపట్టే ప్రాజెక్టులు నాలుగే నాలుగు. ఉప్పల్-నారాపల్లి ఎలివేటెడ్ నిర్మాణ పనులు నాలుగేండ్ల కిందట మొదలు కాగా… ఇప్పటిదాకా 40 శాతం కూడా పూర్తి కాలేదు. అంబర్పేట ఛేనెంబర్, ఆరాంగర్-శంషాబాద్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ మంజూరైందేగానీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.28 వేల కోట్లతో రూపొందించిన ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.8,092 కోట్లతో చేపట్టిన 47 ప్రాజెక్టుల్లో రూ.3,750 కోట్ల పనులు పూర్తయి 31 నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. మరో రూ.4వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రెండో దశ కింద రూ.3,115 కోట్ల ప్రతిపాదనలకు కూడా తెలంగాణ ప్రభుత్వం పాలనా ఆమోదం తెలిపింది. రేపోమాపో ఆ పనులూ మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో 2014 తర్వాత హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ జంఝాటాలను తప్పించిన ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలు, ఇతర నిర్మాణాలన్నీ తెలంగాణ ప్రభుత్వ నిధులతో నిర్మించినవే తప్ప కేంద్ర సర్కారు నిధులతో నిర్మిస్తున్న నాలుగు ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదు.
2019, డిసెంబరు 15: అప్పటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నమామీ మూసీ పేరిట కార్యక్రమం. మూసీ జన్మస్థలమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల దగ్గర ప్రత్యేక పూజలు. తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుందా? లేదా? అంటూ దబాయింపు ప్రకటనలు.
సీన్ కట్ చేస్తే..
మూసీ ప్రక్షాళన రెండో దశ కింద జలమండలి రూ.5 వేల కోట్ల ప్రతిపాదనల్ని మూడేండ్ల కిందటే కేంద్రానికి పంపింది. ఈ క్రమంలో ఆ ప్రతిపాదనలు క్షేత్రస్థాయి పరిశీలనకు జాతీయ నదుల పరిరక్షణ, అభివృద్ధి పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్కు వచ్చారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రతిపాదనలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఆ ప్రాజెక్టు మంజూరు చేస్తే కేంద్రం వాటా కింద రూ.3వేల కోట్లు (60 శాతం) నిధులు వచ్చేవి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి ఉలుకూ లేదు… పలుకూ లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం రెండేండ్లలో మూసీ సుందరీకరణకు రూ.1200 కోట్ల పనులు పూర్తి చేసింది. ఇంకా చేయాల్సి ఉంది.