సికింద్రాబాద్, సెప్టెంబర్ 10: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు గాను పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ నిర్వహించిన అర్హత పరీక్షకు భారీ స్పందన లభించింది. పరవస్తు ఫౌండేషన్ నేతృత్వంలో శనివారం నగరంలోని సికింద్రాబాద్ ఎస్వీఐటీ కళాశాలతో పాటు సంగారెడ్డి, వనపర్తి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన 5.0 అర్హత పరీక్షకు అభ్యర్థులు బారులు తీరారు. ఎస్వీఐటీ కళాశాలలో – 2,300, వనపర్తిలో – 750, సంగారెడ్డిలో – 450 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరవస్తు ఫౌండేషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా సకల సౌకర్యాలు కల్పించారు. ఆయా కేంద్రాల్లో పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడంతో పాటు పరీక్షకు హాజరైన అభ్యర్థులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఎస్వీఐటీ కళాశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని ఫౌండేషన్ సలహాదారులు, అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి పరిశీలించారు. ఈ నేపథ్యంలో పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ కార్యదర్శులు సందీప్ హరి, గద్దె భాస్కర్లు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన అర్హత పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నామని పేర్కొన్నారు.
14వ తేదీన సెలక్షన్ లిస్ట్ను విడుదల చేస్తామన్నారు. దీంతో పాటు 17వ తేదీన సెలక్షన్ అయిన అభ్యర్థులు వనపర్తి, సంగారెడ్డితో పాటు నగరంలోని పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలన్నారు. అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన 351 మంది అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం, డ్రస్, స్టడీ మెటీరియల్లతో పాటు ప్రత్యక్ష బోధన ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో 650 మంది అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారికి సైతం స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ప్రతి ఆదివారం మాక్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గ్రీన్ల్యాండ్స్ అధ్యక్షురాలు లక్ష్మి కుమారి, విజయలక్ష్మి, రఘునాథ్ రెడ్డి, విద్యాభూషణ్, విజయ్ భాస్కర్తో పాటు మదర్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రతినిధి రాధాకృష్ణ, పరవస్తు ఫౌండేషన్ సభ్యులు భవానీ, శ్రీలత, రఘునందన్, షడ్రక్, సుందరయ్య, భ్రమరాంబ, ధనలక్ష్మి, నవనీత, సరోజ, రాజ్కుమార్లు పాల్గొన్నారు.