హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 10(నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతి పెద్ద అమెరికన్ కాన్సులేట్ క్యాంపస్కు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల క్యాంపస్ను ఆకర్షించిన మహా నగరం మరో మైలురాయిని కూడా సొంతం చేసుకోనుంది. ఏకంగా 55 వీసా కౌంటర్లతో అమెరికన్ కాన్సులేట్ ప్రారంభానికి సిద్ధమవుతున్నది. నవంబర్ నెలలో కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటున్నదని స్వయంగా హైదరాబాద్లో యూఎస్ఏ కాన్సులేట్ జనరల్గా నియమితులైన జెన్నీఫర్ లార్సన్ ప్రకటించారు. నూతనంగా నియామకమైన జెన్నీఫర్ ఇటీవల వాషింగ్టన్ డీసీలో జరిగిన గౌరవ విందులో పాల్గొని ఈ విషయాన్ని ప్రకటించారు. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్లో సుమారు 12.2 ఎకరాల స్థలంలో రూ.2251 కోట్ల వ్యయంతో సుమారు 17,917 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను నిర్మిస్తున్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద అమెరికా కాన్సులేట్ కార్యాలయ క్యాంపస్కు హైదరాబాద్ వేదికగా నిలవనుందని జెన్నీఫర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వీసా దరఖాస్తుల పరిశీలనలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కేంద్రంగానూ హైదరాబాద్లోని కాన్సులేట్ కార్యాలయ క్యాంపస్గా నిలవనుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ కార్యాలయంలో వీసా అపాయింట్మెంట్స్ సంఖ్య, ఇంటర్వ్యూ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. దీంతో వీసా ఆమోదం తర్వాత పాస్పోర్టు తిరిగి ఇచ్చే వ్యవధి మరింత తగ్గుతున్నది. ప్రస్తుతం, బేగంపేటలోని పైగా ప్యాలెస్లో 2008 నుంచి 14 కాన్సులర్ విండోస్లతో అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటున్నది. దానికి అనుగుణంగా ప్రస్తుతం, బేగంపేటలోని కాన్సులేట్ కార్యాలయానికి వీసా ఇంటర్వ్యూ కోసం వస్తే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటున్నది. ఇందుకు రోజుల తరబడి సమయం పడుతున్నది. కొత్త క్యాంపస్ 55 కౌంటర్లతో అందుబాటులోకి వస్తే ఇక్కడి నుంచి వేగంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే, కొవిడ్ మహమ్మారి దరిమిలా వీసాల సంఖ్య చాలా తగ్గింది. ఈ క్రమంలో కొత్త క్యాంపస్ అందుబాటులోకి వస్తే పెండింగ్ సంఖ్య చాలా మేరకు తగ్గనుంది.