బేగంపేట్, ఆగస్టు 27: గాంధీ ఆసుపత్రి ప్రధాన గేట్ ఎదుట భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి ఆయన శనివారం గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. 16 ఫీట్ల గాంధీ విగ్రహంతో పాటు గార్డెనింగ్, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్టు తెలిపారు. హెచ్ఎండీఏ అధికారులు మంత్రికి అభివృద్ధి పనుల నమూనాను వివరించారు. అంతకు ముందు బన్సీలాల్పేట మెట్లబావి దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలతా జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సుదర్శన్, జల మండలి జీఎం రమణారెడ్డి పాల్గొన్నారు.