వ్యవసాయ యూనివర్సిటీ , ఆగస్టు 21 : మట్టి వినాయకులకు సహజ సిద్ధమైన రంగులను ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ శాస్త్రవేత్తలు అద్దుతున్నారు. ప్రస్తుతం ఆరు అంగుళాల ఎత్తు నుంచి మొదలు ఐదు అడుగుల ఎత్తు వరకు దాదాపు 800 విగ్రహాలను సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 25 నుంచి విగ్రహాలను మార్కెట్లో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లె నుంచి పట్టణాల్లోని ప్రతి వీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మట్టి విగ్రహాలను ప్రజలకు అందించేందుకు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కార్యాచరణ చేపట్టారు. ఇందుకు రాష్ట్రంలోని పోచంపల్లి, రంగారెడ్డి (చిలుకూరు), మెదక్, చేవెళ్ల, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి బంకమట్టి విగ్రహాలను తీసుకువచ్చారు. వాటికి సహజ సిద్ధమైన రంగులు అద్దేందుకు స్వయంగా వాటి తయారీకి శ్రీకారం చుట్టారు. చెట్ల పూలు, బెరడు (చెక్కలు ), పండ్ల, చెట్టు ఆకులను సేకరించి సహజ సిద్ధమైన రంగులను సిద్ధం చేశారు. స్వయంగా తయారీ చేసిన రంగులను వినాయక విగ్రహాలకు అద్ది.. అందంగా తీర్చిదిద్దారు. చూడ ముచ్చటైన ఈ సహజ రంగుల వినాయక ప్రతిమలను ఈ నెల 25 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని వర్సిటీ కళాశాల కమ్యూనిటీ సైన్స్ విభాగం డీన్ డా. రత్నకుమారి తెలిపారు. టీఎస్పీసీబీ తెలంగాణ కంట్రోల్ బోర్డు ఇచ్చిన బడ్జెట్కు అనుగుణంగా విగ్రహాలను తయారు చేసి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందజేస్తామన్నారు. మట్టి, సహజసిద్ధమైన రంగులతో రూపుదిద్దుకున్న ఈ విగ్రహాలు ఆరు అంగుళాల ఎత్తు నుంచి ఐదు అడుగుల ఎత్తు వరకు దాదాపు 800 విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అందుబాటులో ధరలు ..
ప్రస్తుతం వినాయక విగ్రహాలు అందుబాటులో ఉంచారు. ఇతర వ్యాపారులకంటే అతి తక్కువ ధరలకే విగ్రహాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఐదు అడుగుల విగ్రహం రూ.18000, నాలుగు అడుగుల విగ్రహం రూ.12,000, మూడు అడుగుల విగ్రహం రూ.8,500, ఒక అడుగు రూ.500, 8 అంగుళాల విగ్రహం రూ.180, ఆరు అంగుళాల విగ్రహం రూ.120లకు లభిస్తున్నదని తెలిపారు.
తయారీలో శిక్షణ ..
2016 నుంచి ఇప్పటికీ 25 వర్క్ షాపులు నిర్వహించి కళాకారులు (హర్టీజన్స్), వినియోగదారులు అవగాహన కల్పించారు. 48 ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 7,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చామన్నారు. మహిళా గ్రూప్ సభ్యులకు వారం రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు
చదువుతోపాటు అవగాహన..
కమ్యూనిటీ సైన్స్ను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఉద్యోగ అవకాశాలే కాకుండా, బిజినెస్ పరంగా ఎంతో తోడ్పాటు అందిస్తుంది. వినాయక విగ్రహాలకు సహజ రంగులు వాడి తయారు చేశాం. ఈనెల 25నుంచి మార్కెట్లో అం దుబాటులో ఉంటాయి. ఈ కోర్స్ చదువుతున్న విద్యార్థులే కాకుండా గృహిణులు కూడా ముందుకొచ్చి నేర్చుకోవచ్చునని అధికారుల తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నిత్యం ఆఫీస్ ఇన్చార్జి లక్ష్మీపూజ సంకు, పీఆర్వో సుధాకర్ తదితరులు పాల్గొంటున్నారు.