మహేశ్వరం, ఆగస్టు 21: రైతులు పండించిన కూరగాయలను వ్యవసాయ క్షేత్రాల వద్దనే అమ్ముకుంటున్నారు. మరికొంత మంది రైతులు తమ పొలాల్లో పండించిన కూరగాయలను వ్యయ ప్రయాసాలకు ఓర్చి హైదరాబాద్ మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. చాలా మంది రైతులు మార్కెట్లో ఎక్కువ డిమాండ్గా ఉన్న కూరగాయలను పండించి వ్యవసాయ పొలాల వద్దనే విక్రయిస్తున్నారు. మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లి, అమీర్పేట్, నాగారం, డబిల్గూడ, సిరిగిరిపురం గ్రామాల రైతులు తమ పొలాల్లో పండించిన కూరగాయలను రోడ్డు పక్కనే విక్రయిస్తున్నారు. ప్రజలు కూడా తాజా కూరగాయలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కూరగాయల రైతులు ఎక్కువగా పశువుల పేడను ఎరువులుగా వాడుతూ పంటలు పండిస్తున్నారు. పంట పొలాల వద్దనే కూరగాయలు విక్రయిస్తున్నారు. పొలాల వద్ద మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండటంతో ఉద్యోగస్తులు, మహిళలు వచ్చి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. పండించిన చోటే కూరగాయలు అమ్ముడుపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా కూరగాయలనే కొంటున్నాం..
మార్కెట్లో లభించే కూరగాయలు తొందరగా కుళ్లి పోతున్నాయి. పొలాల వద్ద లభించే కూరగాయలు తాజాగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు మంచిగా ఉంటున్నాయి. ఇక్కడ పండించే కూరగాయలకు రసాయన మందులను వాడరు. కూరగాయలు తాజాగా ఉంటాయి. పొలాల వద్ద కొనుగోలు చేస్తున్న కూరగాయలు మంచి రుచికరంగా కూడా ఉంటాయి. అందువల్ల వ్యవసాయ పొలాల వద్దనే కూరగాయలను కొనుగోలు చేస్తున్నాం.
– పిట్టల సుభద్ర, రావిరాల జెన్నాయిగూడ
తక్కువ ధరలకే అమ్ముతున్నాం..
పండించిన కూరగాయలను తక్కువ ధరలకే అమ్ముతున్నాం. పొలాల వద్దనే అమ్ముతుండటంతో ఇతర ప్రాంతాలకు పోయేందుకు సమయం ఆదా అవుతున్నది. మార్కెట్కు వెళ్లి విక్రయించాలంటే దినమంతా పోతుంది. ఇక్కడే అమ్మితే కొంత ఖర్చులు మిగులుతున్నాయి. మన్సాన్పల్లి, మహేశ్వరం నుంచి వచ్చే ఉద్యోగులు రోడ్డు దగ్గర వారి వాహనాలను ఆపి తాజా కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఆకు కూరలు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిన సాయంతోనే తాజా కూరగాయలను పండించి అమ్ముకుంటున్నాం.
– లక్ష్మమ్మ, మహిళా రైతు, సిరిగిరిపురం