ఖైరతాబాద్, ఆగస్టు 18: సాగర తీరం ఉద్యానవనంగా మారింది. చల్లటి గాలుల మధ్య వేలాది వృక్ష జాతులతో ప్రకృతి సోయగం పరవశిస్తున్నది. పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా వన ప్రేమికులను ఆకర్షిస్తున్నది. పూలు, పండ్లు, ఔషధ, ఏక బిల్వం, బోధి వృక్షం, బ్లాక్ మ్యాంగో లాంటి అరుదైన మొక్కలు, వ్యవసాయ పనిముట్లు, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. మేళాలో ఏర్పాటు చేసిన 120 స్టాళ్లలో ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.6 శాతం పెరిగిందని.. ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మొక్కలను పెంచడాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. హరితహారం లాంటి కార్యక్రమాలతో పాటు వన సంరక్షణలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో 12,751 గ్రామాలు ఉంటే.. అంతే సంఖ్యలో నర్సరీలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గ్రీన్ ట్యాక్స్ విధించడం ద్వారా ఆ డబ్బులను మొక్కల పెంపకం, ప్రకృతి వన సంరక్షణకు ప్రభుత్వం ఖర్చుపెడుతున్నదన్నారు. రాష్ట్రంలో ఏడేండ్లలో 240 కోట్ల మొక్కలు నాటామని, ఈ ఏడాది కూడా 20 కోట్ల మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. మొత్తం రాష్ట్రంలో 260 కోట్ల మొక్కలు జీవం పోసుకుంటున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణలో 24 శాతం మాత్రమే గ్రీన్ కవర్ ఉన్నదని, నేడు 31.6 శాతానికి పెరిగిందన్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి జన్మదినం నాడు పిల్లలకు వారి భవిష్యత్ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మొక్కలను నాటించాలని, వారే పరిరక్షించాలన్నారు. ఎవరైనా తమకు ఇష్టమైన వారు చనిపోయినప్పుడు కూడా ఒక మొక్క నాటాలని, అందులో వారిని చూసుకోవాలని, స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రాండ్ నర్సరీ మేళా నిర్వాహకుడు ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ నెల 22 వరకు ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.
ఒక్క ఆకులోనే బిర్యానీ మసాలా..
బిర్యాని చేయాలంటే పత్తా, లవంగం, షాజీరా, జాపత్రి, ఆనాస పూలు విరివిరిగా వేయాల్సి ఉంటుం ది. కాని ఆల్ స్సైస్ మొక్కలోని ఒకే ఒక్క ఆకు అన్ని రకాల మసాల దినుసుల రుచి, సువాస వెదజల్లుతుంది. బిర్యానీ, మసాలా కూరలో ఒకటి లేదా రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది. గుమ గుమలాడే వంటకం సిద్ధమవుతుంది. ఈ అరుదైన మొక్క నర్సరీ మేళాలోని టెర్రా ఆర్గానిక్స్ సంస్థ ఏర్పా టు చేసింది. దీంతో పాటు మిరాకిల్ ప్లాంట్, పచ్చకర్పూరం, వాటర్ ఆపిల్, తెల్ల నేరేడు, వెల్వెట్ ఆపిల్, బుష్ పెప్పర్, సురినం చెర్రీ, ఎగ్ఫ్రూట్ తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మొక్క ధర రూ. 150 నుంచి రూ.5వేల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఆవు పేడ.. గో మూత్రం
ఎరువులు, పురుగుల మందులు, కెమికల్స్ లేకుండానే స్వచ్ఛమైన ఆవుపేడ. గో మూత్రంతో పండించిన పంటలు ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తాయని రైతు గంట దామోదర్రెడ్డి చెబుతున్నారు. గ్రాండ్ నర్సరీ మేళా వేదికగా ప్రకృతిమయంగా పండించిన పంట ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ రైతు అవార్డు అందుకున్న దామోదర్రెడ్డి తాను పండించిన పసుపుతో క్యాన్సర్ మూడో స్టేజీలో ఉన్నా నయమవుతుందని చెబుతున్నారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన తన ఉత్పత్తులను దేశంలోని పలు రాష్ర్టాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తామంటున్నారు.
ఇంట్లోనే ఆర్గానిక్ మొక్కలు పెంచుకునే టెక్నాలజీ
అనేక రకాల పెస్టిసైడ్స్ వినియోగంతో పెరిగిన కూరగాయలను తినడం అనారోగ్యం. ప్రస్తుత రోజు ల్లో చాలా మంది ఆర్గానిక్ కూరగాయలపై మక్కువ చూపిస్తున్నారు. రసాయనాలు వాడని పండ్లు, కూరగాయలు తీసుకోవాలన్న చైతన్యం ప్రజల్లో వచ్చింది. అందుకే వారి కోసం ఇంటిలోనే ఎలాంటి శ్రమ లేకుండా కూరగాయలు పండించే సాంకేతికతను అభివృద్ధి చేశాం. తక్కువ స్థలంలో ఇమిడిపోయేలా హోమ్ కిట్స్ రూపొందించాం. ఇండోర్ హంగర్తో పాటు సన్లైడ్ డివైడ్, గ్రోవాల్, బాల్కనీ లష్ తదితర పరికరాలను తీసుకొచ్చాం. నర్సరీ మేళాతో మా ప్రాడక్ట్స్కు మంచి ఆదరణ లభిస్తున్నది.
బ్రహ్మ కమలం.. ఏక బిల్వం..
ప్రపంచంలోనే అత్యంత అరుదైన మొక్కలు ఈ స్టాల్లో కనిపిస్తాయి. నిర్వాహకుడు కె. ఆనంద్ అనేక అరుదైన జాతుల మొక్కలను అందుబాటులోకి తెచ్చారు. ఏక బిల్వం, ఎర్ర ఉసిరి, ఎర్ర సీతాఫలం, మలై ఆపిల్, నల్ల పసుపు, సీడ్లెస్ పనాస, పనీర్ ఫ్రూట్, పియర్స్, బ్లాక్ బెర్రీ, బ్లాక్ మ్యాంగో, ఇండిగో బ్లూ తదితర మొక్కలు ఉన్నాయి. పిల్లులకు ప్రీతిపాత్రమైన మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాట్ మింట్ జాతి మొక్కలను పిల్లులు ఇష్టంగా తింటాయని నిర్వాహకుడు ఆనంద్ చెబుతున్నారు.
మొక్కతో మోటివేషన్
మన స్నేహితులకు, బంధువులకు నచ్చేలా మొక్కలను ఇవ్వాలనుకునే వారికి మా వద్ద అరుదైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ మొక్కలు ఉన్నాయి. అంతేకాదు.. ఆ మొక్కలను ఆకట్టుకునేలా అమర్చి వాటిపై ప్రేరణ కలిగించేలా సూక్తులు రాసి ఉంటాయి. వీటిని వివాహాలకు, పుట్టిన రోజు.. తదితర శుభకార్యాల్లో బహుమతిగా ఇవ్వడం ఇటీవల పెరిగింది. మేం లక్కీ డ్రా కూడా ప్రవేశపెట్టాం. కస్టమర్లు చీటీలో తమ వివరాలను రాసి బాక్స్లో వేశాకా.. 22న డ్రా తీసి విజేతకు ఉచితంగా మొక్కలు అందిస్తాం.
– యూసుఫ్ గరారి,కో ఫౌండర్, ప్లాంట్ దర్బార్
ఇంటికి అందాన్నిచ్చే ప్రొడక్ట్స్
మట్టి, కర్ర బొంగులతో ఇంటిరియర్ ప్రొడక్ట్స్ను రూపొందించాం. పల్లె వాతావరణం అనుభూతి చెందేలా విభిన్న రకాల బొమ్మలను తయారు చేశాం. వేలాడుతున్న మట్టి బొమ్మలు ప్రత్యేకంగా ఉన్నాయి. కస్టమర్ల నుంచి మంచి ఆదారణ లభిస్తున్నది. పిల్లలు ఆడుకునే బొమ్మలను కూడా విక్రయానికి ఉంచాం. నర్సరీ మేళాతో బిజినెస్ పెరిగింది. కొత్త కస్టమర్లు తమకు నచ్చిన డిజైన్స్లో ప్రాడక్ట్ కావాలనుకుంటే అందుకు అనుగుణంగా కూడా తయారు చేసి అందిస్తున్నాం.
– ఫాతిమా ఖుజేమా,ఫౌండర్, ఎర్త్ అండ్ ఆర్ట్
బుద్ధుడికి జ్ఞానం ప్రసాదించిన బోధి వృక్షం..
గౌతమ బుద్ధుడికి జ్ఞానం ప్రసాదించిన చెట్టుగా బోధి వృక్షాన్ని కొలుస్తారు. ఈ అరుదైన మొక్కను ట్రే ట్రీస్ బోన్సాయ్ స్టూడియోస్ సంస్థ అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రత్యేకత ఏమంటే.. ఇండోనేషియాలోని సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చిన రాతిలో ఈ మొక్కను పెంచుతున్నారు. దీని ధర రూ.30 వేలకు పైగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బోన్సాయ్ రూపంలో దీనిని పెంచడానికి సుమారు ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. దీంతో పాటు చింత చెట్టు, నిమ్మ లాంటివి కూడా బోన్సాయ్ రూపంలో దర్శనమిస్తాయి. సముద్రపు రాతిలో పెంచిన ఫైకస్ జాక్వాలిన్ మొక్క రూ.3 లక్షలు పలుకుతుందని చెప్పారు.
మట్టి లేకుండానే మొక్కల పెంపకం..
నీళ్లు తక్కువగా లభించే దుబాయ్ లాంటి దేశాల్లో వినియోగించే విధానమే హైడ్రోపోనిక్ టెక్నాలజీ. గ్రాము మట్టి అవసరం లేకుండానే పండ్లు, పూలు, ఆకుకూరలను పండించుకోవచ్చు. ఫోమ్ క్యూబ్స్, కోకోపిట్ల సాయంతో మొక్కలను పెంచుతారు. అపార్టుమెంట్లలో రూఫ్టాప్, ఖాళీ స్థలాల్లో పాలీ హౌజ్లను ఏర్పాటు చేసుకొని వీటిని పండించుకోవచ్చని బ్లూ లీవ్స్ ఫార్మ్ వ్యవస్థాపకులు లిఖిత్ శ్యామ్, శ్వేతా చెబుతున్నారు. ఎలాంటి పురుగులమందులు, యూరియాలు వాడనవసరం లేదన్నారు. నీటి ద్వారానే మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తారు. ఒక ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించుకోవచ్చు.
వెదురు బొంగు.. జపనీస్ క్లే..
మొక్కలను కేవలం మట్టి, ప్లాస్టిక్ కుండల్లోనే కాదు. వెదురు బొంగుల్లో కూడా పెంచవచ్చని ప్లాంట్స్ డాట్ ఇన్ నిర్వాహకుడు శ్రీనివాస్ పత్రికర్ తెలిపారు. సింగిల్ , డబుల్ వెల్, త్రీ లేయర్స్ టేబుల్ టాప్ వెదురు కుండలు ప్రత్యేకంగా నిలిచాయి. వీటితో పాటు జపనీస్ క్లేతో తయారు చేసిన పూల, మొక్కల కుండీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జపనీస్ క్లే అనేది ప్రత్యేకమైన మట్టి. ఇందులో మొక్కలు పెంచుకుంటే ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. ఈ కుండీలను ఎలాంటి యంత్ర సాయం లేకుండా చేతితో రూపొందించామని శ్రీనివాస్ వివరించారు.