మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 18: ఇరుకు రోడ్లతో వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించింది. నాగారం మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రధాన లింక్ రోడ్ల అభివృద్ధికి రూ. 209కోట్లు మంజూరు చేసింది. మున్సిపల్ పరిధిలోని ఐదు లింక్ రోడ్లను హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ త్వరలోనే పనులు చేపట్టనుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్లను అభివృద్ధి చేయనుంది. రాంపల్లి చౌరస్తా నుంచి సర్వే నంబర్ 421 హెచ్పీ పెట్రోల్ పంపు వరకు 3.90 కిలో మీటర్ల మేరకు రూ.46 కోట్లు,సర్వే నంబర్ 421 నుంచి యంనంపేట్ వరకు 3.10 కిలో మీటర్లు మేరకు రూ. 38 కోట్లు, రాంపల్లి జంక్షన్-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వయో కరీంగూడ 3.80 కిలోమీటర్ల మేరకు రూ. 50 కోట్లు, యంనంపేట్ ైప్లె ఓవర్ నుంచి రాంపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు 2.60 కిలో మీటర్ల మేరకు రూ.30 కోట్లు, చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు 3.30 కిలో మీటర్ల మేరకు రూ. 45 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. రోడ్ల విస్తరణకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంపై వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరడంతో పాటు ప్రయాణ సౌలభ్యం మెరుగు పడుతుంది. ఏండ్ల నాటి సమస్యకు త్వరలోనే తీరనుంది.
పలు జిల్లాల వాహనదారులకు తీరనున్న కష్టాలు నాగారం మున్సిపాలిటీలో లింక్ రోడ్ల విస్తరణతో పలు జిల్లాల నుంచి వచ్చే వాహనదారులకు కష్టాలు తీరుతాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి నగరానికి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న లింక్ రోడ్ల నుంచి రాకపోకలు సాగిస్తారు.వరంగల్ జాతీ య రహదారి నుంచి నాగారం మీదుగా వాహనదారులు నగరానికి వెళుతుంటారు. ప్రతి నిత్యం నగర శివారుల్లో ఉన్న కాలేజీలకు, నగరానికి పనుల నిమిత్తం ఈ రోడ్ల మార్గంలో ప్రయాణాలు సాగిస్తారు. నాగారం మున్సిపాలిటీలో ఉన్న లింక్ రోడ్ల అభివృద్ధితో పూర్తిగా వాహనదారులకు ఊరట లభించనుంది.
భారీ వర్షాలతో రాకపోకలు బంద్…
రాంపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లే దారిలో ఉన్న వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ రోడ్ల విస్తరణతో వాగు ఎత్త్తు పెంచడంతో వాహన రాకపోకలు సాఫీగా సాగుతాయి. దీంతో రోడ్ల విస్తరణ పనులు త్వరలోనే చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం
నాగారం మున్సిపాలిటీ పరిధి నుంచి నగరానికి వెళ్లే లింక్ రోడ్ల సమస్య ఏండ్ల నుంచి ఉంది. తెలంగాణ ప్రభు త్వం లింక్ రోడ్ల అభివృద్ధికి నాగారం మున్సిపాలిటీకి రూ. 209 కోట్ల కేటాయింది. ఈ నిధులతో లింక్ రోడ్ల విస్తరణ చేపడుతాం. రింగ్ రోడ్డు వరకు ఉన్న లింక్ రోడ్ల విస్తరణతో వాహనదారుల కష్టాలు తీరుతాయి. లింక్ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డికి కృతజ్ఞతలు.
– కౌకుట్ల చంద్రారెడ్డి, చైర్మన్ నాగారం మున్సిపాలిటీ.
ఉత్తర్వులు రాగానే పనులు మొదలవుతాయి
నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లింక్ రోడ్ల అభివృద్ధికి ప్రభు త్వం రూ. 209 కోట్ల మంజూరు చేసింది. చాలా సంవత్సరాల నుంచి వాహనదారులు, ప్రజలు ఎదుర్కొంటునారు. రోడ్ల విస్తరణ పనులు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు ప్రారంభమవుతాయి.
– ఏ.వాణిరెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ