దుండిగల్/కుత్బుల్లాపూర్,ఆగస్టు18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల ‘ఫ్రీడమ్ కప్’ పేరిట క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి హిల్కౌంటీలో నిర్వహించిన క్రికెట్ పోటీలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించా రు. అనంతరం ఆయన క్రికెట్ ఆడి.. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. మేయర్స్ ఎలెవన్ జట్టుకు కొలన్ నీలాగోపాల్రెడ్డి, కమిషనర్ ఎలెవన్ జట్టుకు కమిషనర్ వంశీకృష్ణ కెప్టెన్లుగా వ్యవహరించారు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న మేయర్స్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కమిషనర్స్ ఎలెవన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీంతో మేయర్స్ ఎలెవన్ జట్టు 22 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. రెండు ఓవర్లు వేసి రెండు కీలక వికెట్లు తీసిన మేయర్స్ జట్టు సభ్యుడు, టీఆర్ఎస్ నేత రవికాంత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద క్కింది. అనంతరం నిర్వహించిన పోటీల్లో ఇంజినీరింగ్ ఎలెవన్ జట్టుపై అడ్మినిస్ట్రేషన్ జట్టు గెలుపొందగా, రెవెన్యూ ఎలెవన్ జట్టుపై శానిటేషన్ ఎలెవన్ జట్టు 25 పరుగులతో గెలుపొందింది. ఈ పోటీల్లో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీలో…
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా దుండిగల్ మున్సిపల్ ఉద్యోగులకు గురువారం ఫ్రీడమ్ కప్ పేరిట క్రీడా పోటీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టెన్నీ స్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, కబడ్డీ పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్లో కృష్ణారెడ్డి టీమ్ ప్రథమ బహుమతి, టెన్నీస్లో కరుణాకర్రెడ్డి-జగన్మోహన్రెడ్డి, రమేశ్-మధు, కృష్ణారెడ్డి- నాగమహేందర్ జట్లు విజేతలుగా నిలిచాయి. అదే విధంగా కబడ్డీలో కవిత, రేణుక, మంజుల, రూపవతి జట్టు ప్రథమ బహుమతిని గెలుచుకుంది. విజేతల కు మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి కృష్ణ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ భరత్కుమార్, మేనేజర్ సునంద, రెవెన్యూ ఆఫీసర్ శ్రీహరిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీలో…
వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కొంపల్లి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కలిసి క్రీడోత్సవాలు నిర్వహించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్రన్ క్రికెట్ గ్రౌండ్ గుండ్లపోచంపల్లిలో గురువారం క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీలు జరిగాయి. అనంతరం విజేతలకు బహుమతులను అందించారు. ఈ వేడుకల్లో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, కమిషనర్ రఘు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.