సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): నగరంలో ఐటీ సంస్థల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే జరిగేలా ఆయా కంపెనీల ప్రతినిధులు, ఐటీ రంగానికి సంబంధించిన సంఘాలతోనూ సంప్రదింపులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం టీ హబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం నుంచి క్రమంగా ఆఫీస్లకు వచ్చి పనిచేస్తున్నారని, ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగులు రావాల్సి ఉందన్నారు. ఉద్యోగులందరూ ఆయా కంపెనీల కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా ప్రభుత్వం ఐటీ కంపెనీల ప్రతినిధులు, సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నదని తెలిపారు.
ప్రధానంగా కొవిడ్-19కు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేవన్నారు. అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. కరోనా కేసులు సైతం ఏమాత్రం పెరగడం లేదని, కరోనాకు ముందు మాదిరిగానే కార్యకలాపాలు కొనసాగించేలా ఐటీ కంపెనీలతో నిరంతరంగా సంప్రదిస్తూనే ఉన్నామని తెలిపారు. ‘ఈ మధ్య ఒక విషయం మా దృష్టికి వచ్చింది.. కొంత మంది వర్క్ ఫ్రమ్ హోం పేరు చెబుతూ ఒకేసారి రెండు.. మూడు జాబ్స్ చేస్తున్నారు.. ఇది సరైన విధానం కాదు..’ అని అన్నారు. మరికొంతమంది ఒక కంపెనీకి రాజీనామా చేసి మరో కంపెనీకి వెంటనే మారిపోతున్నారని తెలిపారు.
ఇలాంటి పద్ధతి హైదరాబాద్లో ఎక్కువగా ఉండేది కాదని, బెంగళూరుతో పోల్చిచే హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు స్థిరంగా ఉంటారన్న పేరుందని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఇటువంటి చర్యల వల్ల హైదరాబాద్ ఐటీ జాబ్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నదన్నారు. ఇలా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని నగరంలో ఐటీ రంగాన్ని సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తున్నదని తెలిపారు. ఐటీ రంగానికి సంబంధించిన నాస్కామ్, హైసియా వంటి సంస్థలను సంప్రదించాం.. ఐటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ నుంచి ఆఫీస్లకు వచ్చి పనిచేయాలని వారికి చెబుతున్నామని జయేశ్ రంజన్ చెప్పారు.