సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : చాన్నాళ్ల తర్వాత తిరిగి ఆదివారం ప్రారంభమైన సండే-ఫన్డేను నగరవాసులు అస్వాదించారు. ఆహ్లాదకర వాతావరణాన్ని అస్వాదిస్తూ, వర్షాన్ని లెక్క చేయకుండా ట్యాంక్బండ్కు తరలివచ్చి ఆడిపాడారు. పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన వేడుకలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హెచ్ఎండీఏ నేతృత్వంలో ట్యాంక్బండ్పై 15 స్టాళ్లను ఏర్పాటు చేయగా, తెలంగాణా పోలీస్ బ్యాండ్, ఆరెస్ట్రా – తెలుగు పాటలు, ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు, కోలాటం, తినుబండారాలు, చేనేత, హస్తకళల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు సందర్శకులకు ఉచిత మొకలు పంపిణీ చేశారు.
ముఖ్యంగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు, ఒగ్గుడోలు నృత్యాలు, ఇతర వినోద కార్యక్రమాలు ఉత్తేజపర్చాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్యాంక్బండ్పైకి వాహనాల రాకపోకలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించారు.