సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ సేవలను గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ -2022కు ఎంపిక చేసింది. దేశంలో ఇలాంటి అవార్డు వరించడం మహేశ్ భగవత్కు ఇది మూడోసారి. 1995 బ్యాచ్కు చెందిన ఆయన పలు జిల్లాలతో పాటు హైదరాబాద్, సైబరాబాద్లలో వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ను 2016లో తెలంగాణ ప్రభుత్వం రెండుగా విభజించింది. కొత్తగా ఏర్పాటైన రాచకొండ పోలీస్ కమిషనరేట్కు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మహేశ్భగవత్ నేటి వరకు అదే హోదాలో ఉన్నారు.
ఎన్నో అవార్డులు
2004లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ(పీపీఎంజీ), 2011లో పోలీస్ మెడల్కు మహేశ్భగవత్ ఎంపిక అవ్వగా, తాజాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. వీటితో పాటు జాతీయ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు, స్పెషల్ హానర్ ఇన్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కేటగిరీ, పోలీస్ మీ కోసం, ప్రాజెక్ట్ ఆసరా, వెబ్బర్ సావ్య లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ సివిల్ రైట్స్ అవార్డు, 2017 ట్రాఫిక్ ఇన్పర్సన్స్ రిపోర్టు హీరో, 2017 టాప్ 100 హ్యూమన్ ట్రాఫిక్ అండ్ స్లేవరీ ఇఫ్లూయెన్స్ లీడర్, ఐఏసీపీ లీడర్షిప్ ఇన్ హ్యూమన్ అండ్ సివిల్ రైట్స్ ఇండివ్యుజవల్ తదితర జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఒక వైపు పోలీసు సేవలతో పాటు సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవుతున్న వారికి సలహాలు, సూచనలు ఇస్తూ..1500 మందికిపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్(ఫారెన్), ఐఎఫ్ఎస్(ఫారెస్ట్) తదితర సర్వీసులకు ఎంపిక కావడంలో తన వంతు సహకారాన్ని అందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహకారంతో యూనైటెడ్ నేషన్స్ ప్రచురించిన యాంటీ ట్రాఫికింగ్పై ఎనిమిది పుస్తకాల్లో తన వంతు సహకారాన్ని అందించారు.
మరికొందరు అధికారులకు..
అందరి సహకారం వల్లే.. సీపీ మహేశ్భగవత్
నాపై విశ్వాసం ఉంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, ఇతర ఉన్నతాధికారులు రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేసి నన్ను కమిషనర్గా నియమించారు. అందరి సహకారంతో సేవలు అందిస్తూ వస్తున్నా. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ రావడంతో ఎంతో సంతోషంగా ఉంది. నాకు సహకరించిన ఉన్నతాధికారులకు, కమిషనరేట్లోని అధికారులకు కృతజ్ఞతలు.
ముగ్గురు ఆర్పీఎఫ్ సిబ్బందికి ఇండియన్ పోలీస్ మెడల్
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్స్కు ఎంపికయ్యారు. ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సైదా తహసీన్, ఏఎస్ఐ నాటకం సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ బండి విజయసారథి ఈ అవార్డులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మెడల్స్ అందుకుంటున్న సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్కుమార్ జైన్ అభినందనలు తెలిపారు.
‘చర్లపల్లి’ చీఫ్ హెడ్వార్డర్కు అవార్డు
చర్లపల్లి కేంద్ర కారాగారంలో చీఫ్ హెడ్ వార్డర్గా విధులు నిర్వహిస్తున్న వీరస్వామి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కరక్షనల్ సర్వీస్ మెడల్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర కారాగారం అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.