మేడ్చల్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న ప్రారంభించిన అనంతరం, జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో జిల్లాలోని గండి మైసమ్మ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు పభుత్వ విప్ అరికపూడి గాంధీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుని సభ విజయవంతానికి సమిష్టిగా కృషి చేద్దామన్నారు. కార్యక్రమాల నిర్వహణ, తీసుకోవాల్సిన తదితర చర్యలపై చర్చించి వివిధ నిర్ణయాలు సమష్టిగా తీసుకున్నారు.
నూతన కలెక్టరేట్ను సందర్శించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు
మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద, బేతి సుభాశ్రెడ్డిలు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించే ఒక రోజు ముందే సిద్ధం చేసి ఉంచాలని అధికారులకు మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. జిల్లా అధికారులంతా బాధ్యతగా వ్యహరించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అధికారులకు వివిధ సూచనలు చేశారు. ప్రారంభోత్సవ అనంతరం జరిగే సభ ప్రాంగణ వేదిక ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.