కొండాపూర్, ఆగస్టు 14: సంపూర్ణ ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని, పూర్వికుల నాటి ఆహారపు అలవాట్లను తిరిగి అలవరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో ప్రగతి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘అమృత ఆహా రం’ కార్యక్రమంలో భాగమైన చిరు ధాన్యాలు, మొక్కల ప్రదర్శనకు ఆయన ఎంఎల్సీ సురభి వాణీదేవితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, పూర్వికులు ఆరగించిన చిరు ధాన్యాల వైపు నేటి తరం మొగ్గు చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కొంతమంది ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల్లో లక్షలాది మొక్కలు నాటి అడవుల పెంపకానికి కృషి చేస్తుందన్నారు. ప్రదర్శనలో సామలు, అరికలు, కొర్రలు, ఊదలు, గానుగ కొబ్బరి నూనెలతో పాటు శ్రీగం ధం చెట్లు, సాదాపాకు, గరిక గడ్డి, రావి మొక్కలు, తమల పాకు, బిల్వపత్తి, లెమెన్ గ్రాస్, తులసీ, రణపాల ఆకు వంటి ఆయుర్వేద మొక్కలను ఉంచారు. ఆయుర్వేదం విశిష్టతను నేటి తరానికి తెలియజేసేందుకు ప్రగతి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం, చిరు ధాన్యాలు, ప్రకృతిపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యా ల సంవత్సరంగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉంద ని ప్రగతి గ్రూప్ చైర్మన్ జీబీకే రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఖాదర్ వల్లీ, డాక్టర్ సీఆర్ ప్రభు, జగదీశ్వర్ పాల్గొన్నారు.