సుల్తాన్బజార్, ఆగస్టు 10 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి 22 వరకు భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంఏ అండ్ యూడీ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. బుధవారం ఏసీగార్డ్స్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఇండియన్ ఫొటో ఫెస్టివల్, హెచ్ఎండీఏ, క్రెడాయ్ హైదరాబాద్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఫొటో ఫెస్టివల్ వ్యవస్థాపక డైరెక్టర్ ఆక్విన్ మ్యాథ్యూస్, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళేందుకు ఐపీఎఫ్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 19న ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా ఐపీఎఫ్-2022కు గాను 85 దేశాలకు చెందిన 4,200 మంది ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారని చెప్పారు. 8 కేటగిరిలలో తీసిన ఫొటోలను ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 19 వరకు మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గాలరీలో ప్రదర్శనలో ఉంచబడుతాయని తెలిపారు. సెప్టెంబర్ 17న ఎనిమిది మంది నిష్ణాతులైన జూరీలు విజేతలను ఎంపిక చేస్తారని వివరించారు. ఈ పోటీల్లో ప్రథమ విజేతకు రూ.లక్ష, ద్వితీయ విజేతకు కెమెరాను ప్రదానం చేస్తామన్నారు.