సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ);మహానగరం వజ్రోత్సవ శోభను సంతరించుకున్నది.. మువ్వన్నెల్లో మురిసిపోతోంది.. త్రివర్ణ కాంతుల్లో ధగధగలాడుతోంది.. జయహే భారత్ అని నినదిస్తోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం ఇంటింటికి జాతీయ జెండాలు, స్టిక్కర్లను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు, సీఎస్ సోమేశ్కుమార్.. బోయిన్పల్లి క్యాంపు ఆఫీసులో మంత్రి మల్లారెడ్డి, బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో మేయర్ విజయలక్ష్మి జాతీయ పతాకాలను అందజేశారు. నేటి తరానికి స్వాతంత్య్ర స్ఫూర్తి నింపేలా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే నగరవ్యాప్తంగా ఆయా థియేటర్లలో గాంధీ, భగత్సింగ్ చిత్రాలను ప్రదర్శించారు. ఐమాక్స్ థియేటర్లో విద్యార్థులతో కలిసి మంత్రి తలసాని గాంధీ చిత్రాన్ని తిలకించారు. వజ్రోత్సవ స్ఫూర్తితో నేడు 75 ఫ్రీడం పార్కులు ఏర్పాటు కానుండగా, ఒక్కోదాంట్లో 75 చొప్పున 10,350 మొక్కలు నాటనున్నారు.
15 ఏండ్ల వయసు.. 150 కిలోమీటర్ల పరుగు
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పరుగంటే ఆసక్తి.. దేశమంటే భక్తితో 15 ఏండ్ల బాలుడు ఏకంగా 150 కిలోమీటర్లు పరుగెత్తాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అరవింద్ ఘోష్ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 6న హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు ప్రముఖ రన్నర్ విజయ్ ఆధ్వర్యంలో ఓ బృందం పరుగులో పాల్గొనగా.. ఇందులో 15 ఏండ్ల వెంకట్రెడ్డి పరుగును 29.30 గంటల్లో పూర్తి చేసి అందరినీ ఔరా అనిపించాడు. నాగోలుకు చెందిన వెంకట్రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సూల్లో 10వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. జనగాం-హైదరాబాద్ మధ్య రాత్రి 11, తెల్లవారుజామున 4 గంటల నుంచి వర్షంలో పరుగెత్తామని, ఈ నెల 7న ఉదయం హైదరాబాద్కు చేరుకున్నామని వెంకట్రెడ్డి తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వెంకట్రెడ్డి తండ్రి రాజేశ్ రెడ్డి, బృంద సభ్యులు పేర్కొన్నారు.
జాతీయ సమైక్యతను చాటాలి ;కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, ఆగస్టు9 (నమస్తే తెలంగాణ) : జాతీయ పతాకాన్ని ఇంటింటా ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్సన్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దర్గా దయాకర్రెడ్డి, సంజీవ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
563 స్క్రీన్లలో గాంధీ చిత్ర ప్రదర్శన ;మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఖైరతాబాద్, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ సమైక్యతకు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శనను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, సినీ నిర్మాత, ఐమాక్స్ అధినేత రమేశ్ ప్రసాద్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కిశోర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. చిత్ర ప్రదర్శన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. అందులో భాగంగానే విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలోని 563 స్క్రీన్లలో ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతను చాటే విధంగా ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు మంత్రి తలసాని జాతీయ పతాకాలను పంపిణీ చేశారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించుకుందామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని నగర మేయర మంగళవారం బంజారాహిల్స్లోని తన నివాసంలో ప్రారంభించారు. అనంతరం ఎన్బిటి నగర్, ఎల్బి నగర్ మైథిలి నగర్లలో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ రజినీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమసమాజాన్ని నిర్మిద్దాం
భారత వజ్రోత్సవాలలో భాగంగా మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆమె కోరారు. అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర భారతదేశంలో అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. ప్రతి ఒక్కరం సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో రాష్ర్టాన్ని సాధించాడని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి 20 లక్షల కుంటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీవో వెంకటాచారి, ఎంపీడీవో నర్సింహులు, తాసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మహేశ్వరం, తుక్కుగూడ పార్టీ అధ్యక్షులు అంగోతు రాజునాయక్, జెల్లల లక్ష్మయ్య, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, సర్పంచ్లు కరోళ్ల ప్రియాంక రాజేశ్, మద్ది సురేఖ కరుణాకర్రెడ్డి, మోతీలాల్ నాయక్, మెగావత్ రాజునాయక్, స్లీవారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కంది అరుణరమేశ్, బండారు లావణ్యలింగం, మంత్రి సంధ్యారాజేశ్, సాలీ వీరానాయక్, గుత్తి పద్మపాండు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.