సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఒక మహత్తర ప్రాజెక్ట్ మెట్రో రైలు నిర్మాణంలో ఎదురైన అనుభవాలు, అడ్డంకులనే ఆధారంగా రాసిన సుదీర్ఘ కవితల సారమే ‘మేఘ పథం మెట్రో కవితా ఝరి’ పుస్తకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి రాసిన ‘మేఘ పథం’ మెట్రో కవితాఝరి పుస్తకాన్ని శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ పైడిపాల, జూలూరు గౌరీ శంకర్తో కలిసి ఆచార్య ఎన్.గోపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్. గోపి మాట్లాడుతూ.. ఒక ప్రాజెక్టు నిర్మా ణం అంటేనే ఎంతో క్లిష్టమైందని, అలాంటి ప్రాజెక్టు రూపకర్తగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డి ఎంతో మనసు పెట్టి ఈ పుస్తకాన్ని రాసినట్లు ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టును ఒక యజ్ఞంలా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పూర్తి చేశారని తెలిపారు.
ఆ అనుభవంతోనే మేఘ పథం పుస్తకాన్ని రాశారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదించాల్సిన అవసరం ఉన్నదని జూలూరు గౌరీ శంకర్ సూచించారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మా ట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చన్నారు. 69 కి.మీ. మేర నిర్మించిన మెట్రో ప్రాజెక్టులో 2600 పిల్లర్లు ఉంటే, ప్రతి పిల్లరు నిర్మాణం ఒక ప్రత్యేక అనుభవాన్ని నేర్పిందని గుర్తు చేశారు. ఆ విషయాలను మేఘ పథం పుసక్తంలో కొంత మేర రాశానని, ఇంకా రాయాలంటే చాలా అంశాలు ఉన్నాయని చెప్పారు. ఒకేసారి 370 కోర్టు కేసులు వేశారని, అయినా వాటిని ఎదుర్కొని పూర్తి చేశామన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ శాఖలైన రైల్వే, రక్షణ, జాతీయ రహదారుల సంస్థలు సైతం ఏండ్ల తరబడి అనుమతివ్వలేదని గుర్తు చేశారు. ప్రధానంగా 30 వరకు మత కట్టడాలు ప్రాజెక్టుకు ఆటంకంగా మారితే.. అందరినీ ఒప్పిస్తూ, నిర్మాణాలు చేపట్టి చివరకు తాము అనుకున్నట్లుగా మెట్రో రైలు ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందన్నారు. 15 ఏండ్ల పాటు ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన అనుభవాల సారమే ఈ పుస్తకమని వివరించారు.
మేనేజ్మెంట్ విద్యార్థులు కేస్ స్టడీస్గా తీసుకోవచ్చు
ఒక ప్రాజెక్టు చేపట్టడంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అందుకు మంచి ఉదాహరణ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఉన్న ఎన్వీఎస్ రెడ్డి తన ప్రత్యక్ష అనుభవంతో రాసిన పుస్తకం ఇది. పుస్తకం కవితల రూపంలో ఉన్నది. అందులో ప్రాజెక్టును చేపట్టడంలోనే ఆది నుంచి చివరి వరకు ఎదురైన ఎన్నో అంశాలను రాశారు. ఈ పుస్తకాన్ని ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థులు కేస్ స్టడీస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– వరప్రసాద్ రెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు
‘రోజుకు 4 లక్షల మంది’
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మెట్రోలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గత వారం రోజులుగా పెరిగిన మెట్రో ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తే రోజూ సగటున 3.94 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. కరోనాకు ముందు ప్రతిరోజూ 4 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణించారు. తిరిగి రెండేండ్ల తర్వాత ఇప్పుడు అలాంటి రద్దీ మెట్రోలో కనిపిస్తున్నదని మెట్రో అధికారులు తెలిపారు.