తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 9: దేశభక్తుల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో సీస పద్యాలతో రచించిన కవులను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అభినందించారు. నవ్య సాహితీ సమితి, అబ్జ క్రియేషన్స్ సంయుక్తాధ్వర్యంలో భారత స్వాంతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త కోడిహళ్లి మురళీమోహన్ సంపాదకత్వంలో డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గౌరవ సంపాదకత్వంలో 108 మంది భారత స్వాతంత్య్ర సమరయోధుల గురించి వెలువరించిన స్వాతంత్య్ర భారతికి అమృతోత్సవ హారతి ముక్తక పద్య కావ్య గ్రంథావిష్కరణ సభ సుల్తాన్బజార్లోని శ్రీకృష్ణ దేవరాయ తెలుగుభాషా నిలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగాహాజరైన జస్టిస్ రామలింగేశ్వరరావు గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రఖ్యాత సాహితీవేత్తలు ఉడయవర్లు, దత్తాత్రేయ శర్మ, లలితా పరమేశ్వరి, డా. బి.జయరాములు, నవ్యసాహితి సమితి అధ్యక్షులు వేమరాజు విజయ కుమార్, అబ్జ క్రియేషన్స్ కార్యదర్శి ఫణి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.