ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 9: భారత విదేశాంగ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా తీర్చిదిద్దారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ అన్నారు. జాతి ప్రయోజనాలే ప్రధానంగా విశ్వానికి మంచి చేయాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పారు. ‘మోడీ@20: డ్రీమ్స్ మీట్ రియాలిటీ’ పుస్తకంపై చర్చా కార్యక్రమాన్ని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో మంగళవారం నిర్వహించారు. ఇఫ్లూ వీసీ, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ ఇ. సురేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కీర్తి పతాకను విశ్వవ్యాప్తం చేస్తున్నారని మోడీని కొనియాడారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాన్స్లర్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పాల్గొన్నారు.