సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నగరానికి రక్షణ కవచంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి రెప్ప వాల్చకుండా నిఘా పెట్టాయి. కానీ మరి వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూడాలి..? అనే ప్రశ్న తలెత్తుతున్నది. కొన్ని సందర్భాల్లో సీసీ కెమెరాల వద్దకు వెళ్లి ఫుటేజీలను సేకరించేందుకు ప్రయత్నిస్తే గాని అవి పనిచేయడం లేదని తెలుస్తున్నది. నిర్వహణ లేక ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. పనిచేయకుండా అక్కడక్కడా అవి అలకార ప్రాయంగానే మారుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలాంటే సీసీ కెమెరాల రక్షణకు పటిష్టమైన విభాగం ఉండాలని పోలీ సు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ‘తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ సొసైటీ’ (టీపీసీసీ) అనే సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా సీసీ కెమెరాల నిర్వాహణ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
సీఎస్ఆర్ నిధులతో..
రాష్ట్రం, కమిషనరేట్, జిల్లా, డివిజన్, పోలీస్స్టేషన్ల వారీగా ఈ సొసైటీలు పనిచేస్తాయి. ఈ సొసైటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా నిధులను స్వచ్ఛందంగా సేకరిస్తారు. దీంతో పాటు వ్యక్తు లు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వవచ్చు. అయితే ఈ సంస్థకు విరాళాలు ఇచ్చే సంస్థలకు, వ్యక్తులకు ఆదాయ పన్నులో మినహాయింపు ఉండే విధంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆదాయ పన్ను శాఖకు లేఖలు రాసిం ది. సీఎస్ఆర్ కింద వచ్చే విరాళాలకు మినహాయింపులు వచ్చినా, వ్యక్తులకు సంబంధించిన విరాళాలకు ఐటీలో మినహాయింపు అనుమతి వచ్చిన తరువాతనే ఈ సంస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో 7.5 లక్షలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం వందల సంఖ్యలో ఉన్న సీసీ కెమెరాలు ఇప్పుడు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 7.5 లక్షల వరకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగానే సీసీ కెమెరాలు ఉన్నాయి.