సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): శంషాబాద్లోని జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్తోపాటు బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ల ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లు సీఈవో ప్రదీప్ ఫణికర్ మంగళవారం తెలిపారు. కేవలం కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం మాత్రమే కాకుండా విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థ చుట్టూ ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా భాగస్వాములందరి సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. జీరో- కార్బన్ ఎమిషన్ ఎయిర్ పోర్టుగా ఉండాలనే లక్ష్యంగా, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సుస్థిర ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
మెయిన్ కార్ పార్కింగ్ వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ ఉండగా, బయో- డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రజా రవాణా కేంద్రం (పీటీసీ) వద్ద నెలకొల్పినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ చార్జింగ్ 30 కేవీతో ఒక ఫోర్ వీలర్ వాహనాన్ని గంటలో ఫుల్ చార్జ్ చేస్తుందన్నారు. భారతీయ విమానాశ్రయాల్లో మొట్టమొదటిసారిగా బయో- డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడే నెలకొల్పినట్లు చెప్పారు. బయోడీజిల్ వాడకం డీజిల్ ఇంజిన్ల జీవితకాలాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. బయో డీజిల్ వల్ల గ్లోబల్ వార్మింగ్, గ్రీన్హౌస్ ప్రభావం ప్రమాదాన్ని తగ్గించే వీలుందని పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో బయో డీజిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.