స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలు.. విరోచిత పోరాటాలు.. మహనీయుల ఉపదేశాలు..అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు.. వెరసి స్వతంత్ర భారత్ కల సాకారమై 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. నేటి నుంచి ఈనెల 22 వరకు 15 రోజులపాటు రోజుకోరీతిలో కనువిందు చేసేలా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. తొలిరోజు ప్రారంభ సమారోహం జరగనుండగా.. మంగళవారం గ్రేటర్వ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా జీహెచ్ఎంసీ 20 లక్షల జెండాలను పంపిణీ చేయనుంది. ఇందుకు సర్కిల్, వార్డుల వారీగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నాటి స్వాతంత్య్ర పోరాట పటిమ నేటి తరానికి జ్ఞప్తికి తెచ్చేలా పలు థియేటర్లలో చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, జంక్షన్లు, ఫ్లైఓవర్లు మూడు రంగుల్లో మురిసేలా అలంకరించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)/ జూబ్లీహిల్స్: ప్రతి ఇంటిపై జాతీయ జెండా, ప్రతి గుండెలో భారతీయత నింపేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగిరేలా ప్రత్యేక కార్యాచరణతో ఈ నెల 8 నుంచి 22 వరకు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ప్రతి పౌరుడు ఈ వజ్రోత్సవాల్లో భాగస్వాములయ్యేలా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేసింది. వజ్రోత్సవ వేడుకల్లో విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారు లు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు..అన్ని వర్గాలు పాలుపంచుకునేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.
నగర ప్రజల్లో దేశభక్తి భావన కల్పించేలా, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా నిర్వహించేలా 20 లక్షల ఇండ్లలో జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ నెల 9వ తేదీన ఏకకాలంలో 20 లక్షల జాతీయ జెండాలు, 25 లక్షల మేర స్టిక్కర్లు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు వజ్రోత్సవాల కార్యక్రమాలను జోనల్, సర్కిల్, వార్డులు, కాలనీల వారీగా విభజించి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలొలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ సమైక్యత, దేశ భక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆగస్టు15న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
విద్యార్థులకు దేశభక్తి సినిమాలు..
వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులను 3 రోజుల పాటు సినిమా థియేటర్లకు తీసుకెళ్లి దేశభక్తి సినిమాలు చూపించనున్నారు. ఆగస్టు 9,10,11 తేదీలలో 6 వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు గాంధీ నేపథ్యంతో ఉన్న సినిమాలు చూపించనున్నారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు చలన చిత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ పాఠశాల విద్యార్థులను ప్రత్యేక వాహనాలలో తరలించి.. సినిమా వీక్షణ తరువాత మళ్లీ ఆ వాహనాలలో పాఠశాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో పాటు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు దేశభక్తి పెంపొందించేలా వ్యాసరచన, వకృత్వ, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు.
వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హరీశ్
మేడ్చల్, ఆగస్టు7(నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్వత్రంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి వజ్రోత్సవ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ తెలిపారు. వజ్రోత్సవాలలో విద్యార్థులకు దేశభక్తిని పెంపోందించేందుకు ఈ నెల 9 నుంచి 21 వరకు జిల్లాలోని 40 థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రత్యేక షోలు ప్రదర్శంచేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రతి రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 6 తరగతి నుంచి 10 వతరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ చిత్రాన్ని 40 థియేటర్లలో ప్రదర్శించనున్నామని, 9, 10, 11 తేదీలతోపాటు 16 నుంచి 21 వరకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. జిల్లాలోని 1,540 పాఠశాలలకు చెందిన 2, 92,764 విద్యార్థులకు చిత్రాన్ని చూయించే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించినట్లు కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పాఠశాలల్లో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సాలను విజయవంతం చేస్తామని జిల్లా విద్యాధికారి విజయకుమారి తెలిపారు.