మాదాపూర్, ఆగస్టు 5: ఆటో రంగంలో విద్యుత్తో నడిచే వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, పలు ఆటోలను ఇప్పటికే పలు కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పలు ప్యాసింజర్ మోటార్ సంస్థలు హైటెక్స్ వేదికగా ఆయా సంస్థలకు చెందిన వాహనాలను ప్రవాస్ 3.0లో భాగంగా పలు రవాణా వాహనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే రఘనందన్రావుతో పాటు బీవోసీఐ చైర్మన్ జగదీశ్సింగ్, బీవోసీఐ అధ్యక్షులు ప్రసన్న పట్వర్ధస్ తదితరులు హాజరై ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో టాటా మోటార్స్, అశోక్ లీ ల్యాండ్, మహేంద్ర, వీఈ కమర్షియల్, రెడ్ బస్, భారత్ బెంజ్, ఒలెక్ట్రా, కుమిన్స్, అభి బస్, సీఎన్జీ బస్సులతో పాటు పలు ఇన్సూరెన్స్ కంపెనీలు, కార్గో వంటి సంస్థలకు చెందిన నూతన వాహనాలను ప్రదర్శించారు. వీటిని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ పర్యాటక ఆపరేటర్లు, క్యాబ్స్ వంటి రవాణా వ్యవస్థ ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల ప్రజారవాణా అభివృద్ధికి కొత్త ఆశయాలను రూపకల్పన చేసేందుకు మంచి వేదిక అవుతుందని అన్నారు. అత్యాధునిక సాంకేతికతో కూడిన ఉద్యోగుల బస్సులు, స్కూల్ బస్సులను అభివృద్ధి చేసిన దిగ్గజ కంపెనీలకు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్లీట్ యాజమానులు, ఆపరేటర్లతో పాటు 28 రాష్ర్టాల నుంచి 8 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హజరయ్యారు.
700 గరాలకుపైగా విస్తరించిన స్మార్ట్ బస్..
ఇంట్రాసిటీ స్మార్ట్ బస్ దేశంలో అన్ని నగరాల్లో సర్వీసులను అందిస్తుంది. ఎంతో విశాలంగా సకల హంగులతో ఫుల్ ఏసీ వసతులతో ఈ బస్సు ఉంటుంది. ఇందులో దూర ప్రయాణాలు చేసే వారు పడుకోవాలన్న ఇంట్లో మాదిరిగానే బెడ్పై పడుకున్న ఫీలింగ్ వచ్చేలా దీని సీట్లు ఉంటాయి. ఈ బస్సులో ఆన్బోర్డ్ వాష్రూమ్లతో పాటు పూర్తి వైఫై కనెక్టివిటీతో, ఆటో మేటిక్ ఫ్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో ఉంటాయి. ప్రయాణికుల భద్రతకు సీసీటీవీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఈ బస్సులో ప్రయాణించాలంటే కేవలం ఆన్లైన్లోనే టికెట్లను బుక్ చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 700 నగరాలకు ఈ బస్సు కనెక్టివిటీ ఉంది.
45 నిమిషాల చార్జింగ్తో కిలో మీటర్లు…
జేబీఎం ఎకో లైఫ్ ఎలక్ట్రికల్ బస్సు ఎంతో ఆకర్శణీయంగా ఉంది. అత్యాధునిక సాంకేతిక ఆధారంగా ఆటో కూలింగ్ సిస్టమ్తో ఈ బస్సును తయారు చేశారు. ఈ కంపెనీ రెండు రకాల బస్సులను తీసుకువచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సును రూపొందించారు. ఈ బస్సు కేవలం 45 నిమిషాల్లో 250 కిలోమీటర్ల రేంజ్ను కలిగి ఉంది. ఇందులో 37 మంది ప్రయాణించేలా సీట్లను ఏర్పాటు చేశారు. బస్సులో నాలుగు దిక్కులా ఉన్నటువంటి టైర్లలో ఎంత గాలి ఉందో తెలియజేసేలా డ్రైవర్ క్యాబిన్లోని డిజిటల్ మీటర్లో తెలుస్తుంది.