‘తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే సాధారణ కాన్పు మేలు. మంచి రోజు, ముహూర్తాల కోసం వైద్యులపై ఒత్తిడి తెచ్చి సిజేరియన్లు చేయించొద్దు. అనవసరంగా వారిని అనారోగ్యం పాల్జేయొద్దు. ఆపరేషన్ల వల్ల 40 ఏండ్లలోపే మహిళలకు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వైద్యులు కూడాఆపరేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు ఉన్నాయి. ప్రైవేటులకెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసి అప్పుల పాలుకావొద్దు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో 57 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. కేంద్రం పట్టింపులేని తనం వల్ల బీబీనగర్ ఎయిమ్స్లో అధ్వానసేవలు అందుతున్నాయి. వారం పదిరోజుల్లో మేడ్చల్ జిల్లాలో 13 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తాం’ అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. రూ.7.5 కోట్లతో మేడ్చల్లో నిర్మించనున్న మాతాశిశుసంరక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన, రూ.50 లక్షలతో ఆధునీకరించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి మేరకు శామీర్పేటలో త్వరలో పోస్టుమార్టం కేంద్రాన్ని పునరుద్ధరిస్తామని హామీఇచ్చారు.
– మేడ్చల్ రూరల్, ఆగస్టు 3
మేడ్చల్, నమస్తే తెలంగాణ / మేడ్చల్ రూరల్, ఆగస్టు 3: ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల మాతా శిశు దవాఖానకు శంకుస్థాపన చేయడంతో పాటు బాలవికాస సంస్థ రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన సీహెచ్సీని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. టీఎస్ డయ్నాస్టిక్స్ సెంటర్ ద్వారా అధునాతన పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరవ్యాప్తంగా 18 దవాఖానల్లో ప్రతి రోజు రోగితో పాటు వచ్చిన అసిస్టెంట్ల కోసం దాదాపు 30వేల మందికి కడుపునిండా భోజనం పెడుతున్నామని చెప్పారు. అదేవిధంగా నగరం, దాని పరిసరాల్లో 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయగా, మేడ్చల్ నియోజకవర్గంలో వారం, పది రోజుల్లో 13 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రూ.7.5 కోట్ల వ్యయంతో మేడ్చల్లో కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల మాతా శిశు దవాఖానను 8 నుంచి 10 నెలల్లో పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
నిర్మాణం పూర్తి కాగానే 8 మంది డాక్టర్లను కేటాయిస్తామని, అందులో నలుగురు గైనకాలజిస్టులు, ఇద్దరు చిన్న పిల్లల డాక్టర్లు, ఇద్దరు మత్తు డాక్టర్లు ఉంటారని చెప్పారు. వారితో పాటు 16మంది స్టాఫ్ నర్సులు, సిబ్బందితో కలిపి మొత్తం 50 మందిని నియమిస్తామని అన్నారు. సాధారణ ప్రసవాలు జరగకపోతే తల్లీ, బిడ్డా ఆరోగ్యానికి ఇబ్బందిని మంత్రి చెప్పారు. అవసరమైతేనే వైద్యులు ఆపరేషన్లు చేస్తారని, ఎవరినీ బలవంత పెట్టవద్దని అన్నారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పాలు పట్టాలని, ఆ పాలల్లో అత్యధిక రోగ నిరోధక శక్తి ఉంటుందని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కోరిన మేరకు శామీర్పేటలో పోస్టుమార్టమ్ కేంద్రాన్ని తిరిగి తెరిపిస్తామని, ఘట్కేసర్లో సౌకర్యాలు పెంచుతామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు.
వైద్యానికి రూ. 10వేల కోట్లు
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం వైద్యం కోసం రూ.10వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. శామీర్పేట దవాఖానాలో గతంలో పోస్టుమార్టమ్ చేసేవారని, తిరిగి ఆ కేంద్రాన్ని తెరిపించాలని మంత్రి హరీశ్రావును కోరారు. అలాగే ఘట్కేసర్లో సౌకర్యాలను మెరుగపర్చాలని, ఐదెకరాల స్థలం అందుబాటులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీలు శైలజావిజయానందారెడ్డి, అనిత, కలెక్టర్ హరీశ్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, మున్సిపాలిటీ చైర్పర్సన్లు మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, మేకల కావ్య, పావని, ప్రణీత, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, స్థానిక కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, డీఎంహెచ్ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఆనంద్, బాలవికాస ప్రతినిధి శౌరిరెడ్డి, ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్గౌడ్, మండల చీర్ల దయానంద్ యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాగ్యారెడ్డి, భాస్కర్ యాదవ్, సత్యనారాయణ, మల్లికార్జున్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.