సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ): దేశం కోసం వివేకానందుడు నిత్యం తపించారని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద అన్నారు. రామకృష్ణ మఠంలో శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘లవ్ ఇండియా – సర్వ్ ఇండియా’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద అనుక్షణం దేశం కోసం తపించారని గుర్తు చేశారు. దేశ వ్యాప్త పర్యటన చేశాక స్వామి వివేకానంద కన్యా కుమారిలో 1892 డిసెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఏకధాటిగా ధ్యానం చేసి దేశ ఉజ్వల భవిష్యత్తును ఊహించారని ఆయన చెప్పారు. బ్రిటీషు వారి పాలనలో ఉన్నా అన్ని ఇబ్బందులూ అధిగమించి దేశం విశ్వ గురువుగా ఆవిర్భవిస్తున్నదని స్వామి వివేకానంద ముందే ఊహించారని స్వామి బోధమయానంద చెప్పారు.
వివేకానందుడిలా దేశాన్ని ప్రేమించాలని, దేశ ప్రజల సేవలో తరించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అంద రిపై ఉందని చెప్పారు. అనంతరం ఆన్లైన్ ద్వారా ప్రసంగించిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ సేవ గొప్పతనాన్ని వివరించారు. ఇతరుల కోసం జీవించేవారే గొప్ప వారన్న స్వామి వివేకానంద సూక్తిని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ కల్నల్ ప్రవీణ్, నెల్లూరుకు చెందిన చైల్డ్ ఆశ్రమ నిర్వాహకులు శరత్ బాబు, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆగస్ట్ 11న ఆజాదీ కా అమృత్ మహోత్సవ ముగింపు కార్య క్రమం రామకృష్ణ మఠంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.