సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో అన్నపూర్ణ కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయ పాత్ర’గా మారాయి. ఆపత్కాలంలో పేదలు పస్తులుండకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఆదేశాల మేరకు గ్రేటర్లో 373 కేంద్రాల్లో రోజుకు దాదాపుగా 80 వేల మందికి రెండు పూటలా ఉచిత భోజనాలు అందిస్తూ ఉన్నారు. రుచి, శుచి సమతుల పోషకాలతో ఆహారాన్ని అందిస్తుండటంతో వలస కార్మికులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, చిరుద్యోగులు కడుపు నింపుకుంటున్నారు. 2014వ సంవత్సరంలో జీహెచ్ఎంసీ చొరవ తీసుకుని ప్రవేశపెట్టిన అన్నపూర్ణ భోజనం పథకాన్ని ప్రభుత్వం రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ పటిష్టంగా అమలు చేస్తున్నది. అన్నపూర్ణ పథకంతో 2014 నుంచి మే నెలాఖరు వరకు 9,67,53,612 భోజనాలను వడ్డించినట్టు అధికారులు తెలిపారు. ఇందుకు గాను రూ.185 కోట్ల 89 లక్షలను ఖర్చు చేసినట్లు చెప్పారు.
విద్య, ఉపాధి, శిక్షణకు కేంద్రంగా నగరం..
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో దాదాపు ఒక కోటి జనాభా నివసిస్తున్నది. ఆర్థిక స్థితి, నైపుణ్యంతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల ప్రజలను హైదరాబాద్ నగరం అకున చేర్చుకుంటున్నది. దేశంలో విద్యా, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ నగరం గమ్య స్థానంగా మారింది. ఈ నేపథ్యంలోనే నగరానికి వచ్చిన ప్రతి ఒకరి బతుకుకు భరోసా కల్పిస్తున్నది. నగరంలో రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతూ వేలాది మంది యువత పోటీ పడుతున్నారు. అటు పేదలు, ఇటు ఉద్యోగార్థుల ఆకలిని తీర్చేందుకు అన్నపూర్ణ భోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నది. లబ్ధిదారులు నుంచి కేవలం రూ.5/- లకే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన నాణ్యమైన పోషక విలువలున్న భోజనాన్ని అన్నపూర్ణ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్నది.
కొవిడ్ సమయంలో అన్నార్థులకు అండ
కొవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాలు ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. మొదటి విడత కొవిడ్ లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం పూట 373 రెగ్యులర్, మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా అన్నపూర్ణ భోజనం ఉచితంగా పెట్టారు. 259 రెగ్యులర్, మొబైల్ కేంద్రాల ద్వారా రాత్రి పూట భోజనం పెట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ లాంటి విపత్తులో నిరుపేదల ఆకలి బాధను తీర్చేందుకు అన్నపూర్ణ పథకం అక్షయ పాత్రగా మారిందన్నారు. 2020-21లో 2 కోట్ల 29 లక్షలు 46 వేల 80 భోజనాలతో అన్నార్థుల ఆకలిని తీర్చినదని పేర్కొన్నారు. లబ్ధిదారులు సౌకర్యంగా భోజనం చేయుటకు అన్నపూర్ణ కేంద్రాలకు సీటింగ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొదటగా నగరంలో సీటింగ్ అన్నపూర్ణ క్యాంటీన్ల ఏర్పాటుకు 32 ఏరియాలను గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నారు.