సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గ్రేటర్ రహదారులు భారీగా దెబ్బ తిన్నాయి. చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గుంతలు పూడ్చే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా 3094 చోట్ల గుంతలను పూడ్చినట్లు ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల రహదారుల గుంతలను సకాలంలో పూడ్చటంలో నిర్లక్ష్యం వహించిన ఏఈలకు తొలుత నోటీసులు జారీ చేయడం, సదరు అధికారి వివరణ ఆధారంగా జరిమానా విధించడం లాంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో రహదారులపై గుంతల ఏర్పాటుకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా, వాహనదారులకు సాఫీ ప్రయాణమే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొబైల్, మినీ మొబైల్ స్టాటిస్టికల్ మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసి రోడ్డుపై నిలిచిన నీరు తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్ జోన్లో 763, చార్మినార్ జోన్ – 6 సరిల్ పరిధిలో 855, ఖైరతాబాద్ జోన్లోని – 5 సరిల్లో 447, శేరి లింగంపల్లి జోన్లో 220, కూకట్పల్లి జోన్ – 5 సరిల్లో 529, సికింద్రాబాద్ జోన్ – 5 సరిల్ పరిధిలో ఏర్పడిన 280 గుంతలను పూడ్చి వాహనదారులకు
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు
వర్షాకాలం దరిమిలా అక్టోబరు 31వ తేదీ వరకు కొత్తగా రోడ్డు తవ్వకాలను నిలిపివేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నది. ఐతే, వివిధ ప్రైవేట్ సంస్థలు భూగర్భ కేబుల్స్ తదితర పనులతో పాటు విద్యుత్, వాటర్ బోర్డు, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు అత్యవసర పనుల నిమిత్తం రోడ్డు కటింగ్ అనుమతులకు జీహెచ్ఎంసీ అనుమతి కోరుతున్నది. దీంతో ఆయా శాఖలు మౌలిక సదుపాయాల కల్పన, పలు అభివృద్ధి పనులు, ప్రజలు ఇబ్బందులు తొలగించడంలో అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేస్తున్నది. రోడ్డు కటింగ్కు అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో పనులు పూర్తయిన వెంటనే సంబంధిత రహదారుల మరమ్మతులను వెంటనే పూర్తి చేస్తున్నారు.