కేపీహెచ్బీ కాలనీ, జూలై 12 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ రంగారెడ్డి జోన్ సీజీఎం (ఆపరేషన్) పి.ఆనంద్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అత్యవసర బృందాలను సిద్ధం చేయడంతో పాటు ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడురోజులుగా రంగారెడ్డి జోన్ పరిధిలోని సైబర్ సిటీ, రాజేందర్నగర్, సరూర్నగర్, వికారాబాద్ సర్కిళ్ల పరిధిలో 155 విద్యుత్ స్తంభాలు కూలిపోగా వాటన్నింటినీ పునరుద్ధరించినట్లు తెలిపారు. జోన్ పరిధిలో సర్కిల్కు రెండు చొప్పున.. ఎనిమిది బృందాలు.. ఒక్కొక్క బృందంలో ఐదుగురు ఆఫీసర్లు, సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. డీఈల పర్యవేక్షణలో ఏడీఈ, ఏఈలు ఇతర సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్..
వర్షాలతో ఎదురయ్యే విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, ఇబ్రహీమ్బాగ్ విద్యుత్ డివిజన్ల పరిధిలోని వారు 040-23431261, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, కందుకూర్, షాద్నగర్ డివిజన్ల పరిధిలోని వినియోగదారులు 040-23431231, వికారాబాద్ సర్కిల్ పరిధిలోని వికారాబాద్, తాండూరు డివిజన్లకు చెందిన వినియోగదారులు 7901093659, సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని సరూర్నగర్, చెంపాపేట్, ఇబ్రహీంపట్నం డివిజన్లకు చెందిన వినియోగదారులు 040-29802830 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే 1912, ప్రధాన కంట్రోల్ రూమ్ 7382072104/106/574 నంబర్లకు కరెంటు సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.