సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): బచ్పన్ బచావో ఆందోళన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జిల్లా బాలల రక్షణ యూనిట్, కార్మిక శాఖ, పోలీసులు సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ ద్వారా నగరంలో వేర్వేరు అపార్ట్మెంట్లలో పని మనుషులుగా మగ్గుతున్న నలుగురు బాలికలను రక్షించారు. పలు అపార్ట్మెంట్లలో పలువురు బాల బాలికలు కార్మికులుగా పని చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో బచ్పన్ బచావో ఆందోళన్ వెంటనే యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ అధికారి నాగేశ్వర రావు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, సహాయ కార్మిక శాఖ అధికారి రాజశేఖర్ బృందంగా ఏర్పడి నగరంలోని బషీర్బాగ్ ప్రాంతంలో ఉన్న మూడు బహుళ అంతస్తుల నివాస సముదాయాలలో ఈ దాడులు నిర్వహించారు. నలుగురు 13, 15 ఏండ్ల బాలికలను గుర్తించి వారిని రక్షించారు. అనంతరం వారిని నగరంలోని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపర్చి ప్రభుత్వ బాలికల గృహంలో చేర్పించారు.
సదరు బాలికలను ఒడిశాలోని కందమాల్ జిల్లా నుంచి ఓ మధ్యవర్తి తీసుకువచ్చి ఇకడ గృహ యజమానులకు అప్పగించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. పిల్లలతో పనిచేయించుకుంటున్న యజమానులు, మధ్యవర్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే, వారిపై వీరిపై సెక్షన్ 420 కేసులు కూడా నమోదు చేయాల్సిందిగా బాలల సంక్షేమ కమిటీ సూచించింది. ఈ బాలికల వద్ద లభించిన ఆధార్ కార్డులు నకిలీవని గుర్తించారు. బచ్పన్ బచావో ఆందోళన్ సంచాలకులు మనీష్ శర్మ మాట్లాడుతూ నకిలీ ఆధార్ కార్డుల ద్వారా పిల్లల అక్రమ రవాణా ఇటీవల ఎకువగా జరుగుతోందని, ఇలా మైనర్ల వయసులను మార్చి తయారు చేసిన ఆధార్ కార్డుల పై విచారణ జరిపించాలని, ఇలాంటి ఆధార్ కార్డుల వల్ల మైనర్లు సరైన పునరావాసాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురొంటున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోన్నైనా మానవ అక్రమ రవాణా వ్యతిరేక బిల్లును ఆమోదించేటట్లు ప్రయత్నించాలని కేంద్రాన్ని ఆయన కోరారు.