సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ) వస్తువులపై తక్షణమే నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అన్ని సర్కిళ్లకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీల కోసం టాస్క్ఫోర్స్ బృందాలను నియమించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని టాస్క్ఫోర్స్ బృందాలను ఆదేశించారు. నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులు వినియోగించినా, తయారు చేసినా, విక్రయించినా జరిమానాతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఫిర్యాదులను 040-2111 1111కు తెలియజేయాలని అధికారులు సూచించారు.