సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): జల మండలికి సంబంధించిన చెల్లింపులన్నీ ఇక మీదట పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే జరిగే లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త నీటి కనెక్షన్ ఛార్జీలు, నెలవారి నీటి బిల్లుల చెల్లింపులలో ఇప్పటి వరకు బిల్ డెస్క్, టీ-వ్యాలెట్, HIM, PayTm, Google Pay, Phone Pe, Credit Card, Debit Card రూపంలో కొందరు, బిల్ కలెక్టర్ల ఈ పాస్ మిషన్ల ద్వారా నగదు చెల్లింపులు, చెక్కులు ఇస్తూ సంబంధిత బిల్లులు, నీటి కనెక్షన్ ఛార్జీలను వినియోగదారులు చెల్లిస్తున్నారు. సంస్థ పరిధిలో 12 లక్షల వినియోగదారులు ఉండగా, ఉచిత నీటి పథకం అమల్లోకి వచ్చాక సంస్థకు నెలవారీగా దాదాపుగా రూ.70 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. ఇందులో రూ.50 కోట్ల మేర ఆన్లైన్ ద్వారా, రూ.20 కోట్ల మేర బిల్లింగ్ ఏజెన్సీలు, ఇతర చెక్కుల రూపంలో వస్తున్నది. ఐతే, 15 బిల్లింగ్ ఏజెన్సీల కింద దాదాపు 600 మంది వరకు నీటి బిల్లుల జారీ, వసూళ్లకు సేవలందిస్తున్నారు. పేమెంట్స్ విధానమంతా పూర్తి స్థాయిలో ఆన్లైన్లోకి తీసుకువచ్చి వీరి సేవలను మరో పనులకు వినియోగించుకోవడం ద్వారా ఏటా దాదాపు రూ.4 కోట్ల మేర ఆదాయం సంస్థకు ఆదా చేయొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే వందకు వంద శాతం నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.