అమీర్పేట్, జూలై 5: భక్తుల కల్పవల్లి.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢమాసం తొలి మంగళవారం త్రిశూల రూపంలో ఉన్న స్వామివారికి, ప్రత్యక్ష దేవి రూపంలో ఉన్న అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎదుట నిర్వహించిన వార్షిక కళ్యాణోత్సవం చూసేందుకు రెండు కండ్లు చాల్లేదు. రమణీయంగా స్వామి వారు, అమ్మవార్ల నూతన విగ్రహాలను అలంకరించడంతో వేదిక దేవతామూర్తులతో వెలిగిపోయింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఎల్లమ్మ కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
ఉత్తరా నక్షత్రయుక్త కన్యాలగ్న సుముహూర్తమున జరిగిన అమ్మవారి కల్యాణాన్ని నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష భక్తులు, దాతలు, అధికార, అనధికార ప్రముఖులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. దేవాలయ ఆవరణలో నిర్మించిన రెండు షెడ్లలో భక్తులు కల్యాణాన్ని తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మాలోత్ కవిత, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ తదితరులు ఉన్నారు.
అందరికీ ధన్యవాదాలు:మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా జీహెచ్ఎంసీ, వైద్య శాఖ, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాలు చక్కటి ఏర్పాట్లు చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. లెక్కకు మించి వస్తున్నా క్యూలైన్ల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ఎంతో ఓపికతో అమ్మవారిని దర్శించుకునేందుకు ముందుకు కదలడం సంతోషరకరమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు బోనాల పండుగలకు విశేష ప్రాముఖ్యతను ఇస్తుందని అన్నారు. భక్తుల ఆకలి తీర్చడానికి బల్కంపేటవాసులు అన్నప్రసాద వితరణ శిబిరాలు ఏర్పాటు చేసి మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారని అభినందించారు.
అడుగడుగునా అన్నదాన శిబిరాలు..
తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దేవాలయ పరిసరాల్లో టిఫిన్ సెంటర్లు మూసి ఉన్న పరిస్థితుల్లో బల్కంపేటకు చెందిన కూతురు భూమయ్య, మల్లయ్య వంశవృక్షం నిర్వాహకులు కూతురు నర్సింహ ఆధ్వర్యంలో ఇడ్లీలు, ఉప్మా పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి బల్కంపేట పరిసరాల్లో దాదాపు 100కు పైగా అన్నదాన శిబిరాలు వెలిశాయి. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి బయటకు వచ్చిన భక్తులు కడుపునిండా భోజనం చేసేందుకు అనువైన ఏర్పాట్లు చేయడంలో బల్కంపేటవాసులు మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నారు.
నేడు అమ్మవారి రథోత్సవం
మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో బుధవారం చివరి రోజు సాయంత్రం 6 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రథోత్సవాన్ని ప్రారంభిస్తారు. చక్కటి పూలతో అలంకరించే రథంలో ఈ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి రథాన్ని బల్కంపేట పుర వీధుల మీదుగా ఊరేగించి తిరిగి దేవాలయానికి చేరుస్తారు.