సిటీబ్యూరో/ఉప్పల్, జూలై 5 (నమస్తే తెలంగాణ): గంజాయి ముఠా తెలివిమీరింది. పోలీసులకు పట్టుబడకుండా రోజుకో రూటు మార్చేస్తున్నది. అల్లం మాటున, కరివేపాకు మాటున, ఆశిష్ ఆయిల్ పేరుతో గంజాయి తరలిస్తున్న నేరగాళ్లు ఇప్పుడు చేపల మాటున తరలించడం మొదలు పెట్టారు. ఏపీ, ఒడిశా సరిహద్దులో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర సోలాపూర్కు తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో డీసీఎం వ్యాన్ నుంచి కారులోకి గంజాయి ప్యాకెట్లను లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 440 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని తెలిపారు.
ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి డివిజన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.డేవి రవికాంత్ వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన పేరపురెడ్డి అర్జున్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన నేరెళ్ల కిరణ్కుమార్, పేరపురెడ్డి రాజ్ వీరేంద్రకుమార్, సందీప్, తేజ, సయ్యద్ తాహెర్, ఫజల్ ముఠాగా ఏర్పడ్డారు. అర్జున్ మినహా మిగతా వాళ్లంతా బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో 440 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. అర్జున్, కిరణ్ వాటిని చేపలను రవాణా చేసే డీసీఎం వ్యాన్లో లోడ్ చేసి , వరంగల్ వరకు తీసుకొచ్చి, అక్కడ చేపలను అన్లోడ్ చేశారు. గంజాయిని హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్, రాఘవేంద్రనగర్ కాలనీకి తీసుకువచ్చారు. అక్కడకు వచ్చిన తరువాత డీసీఎం నుంచి కారులోకి గంజాయి ప్యాకెట్లను లోడ్ చేస్తూ అనుమానాస్పదంగా కనిపించగా ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు వీరిపై నిఘా పెట్టి పట్టుకున్నారు.
అర్జున్, కిరణ్కుమార్, సయ్యద్ తాహెర్ను అరెస్ట్ చేసి వారి నుంచి 440 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, డీసీఎం, కారును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని సోలాపూర్కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీపీఈఓ డి.అరుణ్కుమార్, మల్కాజిగిరి ఏపీ అండ్ ఈఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్లు మహేశ్వర్రెడ్డి, అబుల్ జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.