చార్మినార్, జూలై 5 : బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకొనే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. రానున్న బక్రీద్ పర్వదినం సందర్భంగా మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో పోలీస్, జీహెచ్ఎంసీ, వక్ఫ్ బోర్డుతోపాటు వివిధ సంఘాలు, మత పెద్దలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. అక్రమ జంతు రవాణాను అడ్డుకునేందుకు నగర వ్యాప్తంగా పలు చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసు అధికారులకు ఇవ్వాలని సూచించారు. అక్రమంగా జంతువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్, ఇతర అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారని తెలిపారు.
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అశోక్ సా మ్రాట్ మా ట్లాడుతూ.. జోనల్ పరిధిలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించడానికి ప్రతి సర్కిల్కు ప్రత్యేకంగా వాహనాలను కేటాయించామని తెలిపారు. వ్యర్థాల కోసం ప్రత్యేకంగా రెండు లక్షల కవర్లను సిద్ధం చేశామని తెలిపారు. పోలీసులు, మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో కలిసి ప్లాస్టిక్ కవర్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామని వాటర్వర్క్స్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో యాకుత్పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ సలీం, అడిషనల్ సీపీలు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు కార్తికేయ, ఎం. రమేశ్, విశ్వప్రసాద్, డీసీపీలు జోయల్ డేవిడ్, రాజేశ్ చంద్ర, చందనాదీప్తి, చక్రవర్తి, సాయి చైతన్య, వోఎస్డీ, టాస్క్ఫోర్స్ డీసీపీలు రాధాకృష్ణ రావు, సునీతారెడ్డి, మత పెద్దలు జమైతుల్ ఖురేషి, హఫీజ్ ముజఫర్, ముఫ్తీ ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
దవాఖాన నిర్వాహకులు అరెస్టు
అబార్షన్ వికటించి మహిళ మృతికి కారకులైన కౌండిన్య దవాఖాన నిర్వాహకులతో పాటు ప్రభుత్వ డాక్టర్ను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… బుద్దానగర్లో కౌండిన్య దవాఖానలో ఈ నెల 26న ఓ మహిళకు అబార్షన్ చేసే క్రమంలో మృతి చెందింది. భయంతో నిర్వాహకులతో పాటు వైద్య సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకులు పాండురంగంరావు, మమత, డాక్టర్ సింపనపల్లి పద్మ, సిబ్బంది ఎ.అవినాశ్, నరేశ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.