మేడ్చల్ రూరల్, జూలై 5 : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాల్లో ప్లాస్టిక్ సంచుల వాడకంపై కమిషనర్ అహ్మద్ షఫీయుల్లాహ్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 120 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న పాలిథిన్ సంచుల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాదారులు వినియోగిస్తే జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మార్కెట్కు వెళ్లేటప్పుడు నార సంచులను తీసుకెళ్లాలని సూచించారు. పాలిథిన్ సంచుల తయారీలో వాడే రసాయనాలు మురుగునీటి ప్రవాహాన్ని నిరోధించి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయని చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహా రెడ్డి, నాయకులు రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకం పై ఉక్కుపాదం పలు దుకాణాదారులకు జరిమానా..
పోచారం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడకం పై మున్సిపాలిటీ ఉక్కుపాదం మోపింది. మంగళవారం కమిషనర్ సురేశ్ సిబ్బందితో కలిసి పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని జరిమానా విధించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ, యంనంపేట్, నారపల్లి ప్రాంతాల్లోని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని యజమానులకు జరిమానా విధించారు. అనంతరం కమిషనర్ సురేశ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని వివరించారు. ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను ఇతర ప్రదేశాల్లో పడవేస్తే… ఇవి డ్రైనేజీలోకి వెళ్లి నీరు ప్రవహించకుండా అడ్డుపడుతాయని పేర్కొన్నారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్లతో వచ్చే అనర్థాలను గుర్తించి, ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను మున్సిపాలిటీ స్వచ్ఛ వాహనానికి అందించాలని కమిషనర్ కోరారు. మున్సిపాలిటీ బిల్కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.