బడంగ్పేట, జూలై 5: ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని బాలాపూర్ మండల తాసీల్దార్ డి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బడంగ్పేట 119 సర్వే నంబర్ ఉన్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. గతంలో ప్రభుత్వం జారీచేసిన ఇండ్ల పట్టాలు ఉన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన పట్టాదారులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరూ భూమి వద్దకు పోవద్దు అన్నారు. వదంతులు నమ్మవద్దు అన్నారు. సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే చర్యలు తప్పవన్నారు. భూమిని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే చాలా మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.