ఖైరతాబాద్, జూలై 5: రాష్ట్రంలోనే మోడల్ విద్యాలయంగా పేరుగాంచిన సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో ఈ ఏడాది విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగింది. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 76 శాతం ఉత్తీర్ణత సాధించడంతో మరింత ఆదరణ పెరిగింది. దీంతో ఈ పాఠశాలలో తమ పిల్లలను చేరిపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అనుకున్నదానికంటే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చేరారు. ప్రైమరీ, హైస్కూల్లో రెండు నుంచి మూడు సెక్షన్లలో తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రైమరీలో 531….హైస్కూల్లో 644
రాజ్భవన్ హైస్కూల్లో విద్యార్థ్ధుల క్రమ సంఖ్య విశేషంగా పెరిగింది. అన్ని వసతులతో కూడిన ఈ పాఠశాలలో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్లో 531, హైస్కూల్లో 644 మంది విద్యార్థులు మొత్తం కలిపి 1,175 మంది చదువుకుంటున్నారు. ఒక్కో తరగతికి మూడు సెక్షన్లను కేటాయించారు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియతో ఒక్క హైస్కూల్లోనే 713కు విద్యార్థుల సంఖ్య త్వరలో చేరుకోనుంది.
ఉపాధ్యాయుల సంఖ్య
ప్రైమరీ స్కూల్లో 8 మంది ఉపాధ్యాయులు ఉండగా, హైస్కూల్లో 14 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. విద్యార్థ్ధులకు అనుగుణంగా ఇంకా ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ప్రైమరీకి పది మంది విద్యావలంటీర్లతో భర్తీ చేస్తే ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. అలాగే హైస్కూల్లో ప్రస్తుతం 14 మందితో పాటు టీచ్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నుంచి 4, సీయాంట్ నుంచి ఒక బోధకులు పాఠాలు బోధిస్తున్నారు. ఇంకా మురో ఏడుగురు కావాలని చెబుతున్నారు.