తెలుగుయూనివర్సిటీ, జూన్ 30: అవధానానికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్నదని శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలోని దేవుపల్లి రామానుజరావు కళా మందిరంలో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న శతావధాన శరత్చంద్ర గన్నవరం లలితాదిత్య మూడు రోజుల సంస్కృతాంధ్ర శతావధానం ధారణ విజయోత్సవ సభ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. బీఏ తెలుగు చదివిన తనకు అవధానం అంటే ఎంతో ఇష్టమన్నారు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం మొదలైన ప్రక్రియలను నిర్వహించడం ప్రతిభావంతులకు, పండితులకే సాధ్యమన్నారు. అమెరికాలో ఉంటూ అంతరిక్ష జ్ఞానాన్ని అభ్యసిస్తూ కూడా శతావధానం చేయడం అంటే అత్యద్భుతమని ప్రశంసించారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. లలితాదిత్య ధారణ ప్రతిభకు తనను తాను మరిచిపోయి తన్మయత్వం చెందానని అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ. రమణాచారి మాట్లాడుతూ.. లలితాదిత్య మూడు రోజులుగా పద్యాలను, శ్లోకాలను ధారణ చేస్తుంటే ఎంతో అబ్బురపడ్డానని అన్నారు.
ధూళిపాల మహాదేవమణి మాట్లాడుతూ.. శతావధానం చేయడమంటే మాటలు కాదన్నారు. శతావధాన సంచాలకులు శ్రీరంగాచార్య అవధానిని ప్రశంసిస్తూ.. ఈ అవధానం తెలుగువారి పురాకృత పుణ్యవిశేషంగా భావిస్తున్నానని అన్నారు. సీఎం కార్యాలయం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ.. అమెరికాలో ఉంటూ శతావధానం చేయడం అంటే లలితాదిత్య ఎంతో శ్రమించి ఉంటారని, ఆయన మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉభయభాషా కోవిదులు పీవీ మనోహరరావు,వేలేటి మృత్యుంజయశర్మ, శాస్ర్తుల వెంకటేశ్వర్లు, సీతారామశర్మ, గండ్లూరి దత్తాత్రేయ శర్మ, అయాచితం నటేశ్వరశర్మ, దోర్బల ప్రభాకరశర్మ, మరుమాముల దత్తాత్రేయశర్మ, డాక్టర్ జి.ఎం.రామశర్మ, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, మురళి, పార్వతీశ్వర శర్మ, ఐతగోని వెంకటేశ్వర్లు, పసర్ల శ్రీవల్లి సుబ్బలక్ష్మి, శంకరమఠం కృష్ణారావు, సురభి శంకర శర్మ, రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గంగాఝరిలా సాగిన లలితాదిత్య పద్యధారణ..
శతావధాన ధారణలో భాగంగా అవధాని గన్నవరం లలితాదిత్య మూడు నిషిద్ధాక్షరి పూరణలు, ఇరవై నాలుగు సమస్యాపూరణలు, ఇరవై నాలుగు వర్ణన పద్యాలు.. మొత్తం 75 పద్యాలను ముప్పై రెండు నిమిషాల పదిహేను సెకన్లలో ఏ మాత్రం తడుముకోకుండా సాధికారతతో వేగవంతంగా ధారణ చేసి ఆహూతుల కరతాళధ్వనులందుకున్నారు. తెలుగు, సంస్కృత భాషలలో పద్యధారణ చేసిన లలితాదిత్య విజ్ఞానం. అమ్మభాష గొప్పదనాన్ని ఇనుమండింపజేసింది. పద్యాల మాధుర్యాన్ని స్వరమాధుర్యంతో ధారణ చేసి లలితాదిత్య తెలుగు భాషాభిమానులను రంజింపజేసి ప్రశంసలు అందుకున్నారు.