ముషీరాబాద్, జూన్ 30: బస్తీల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పాదయాత్రల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గురువారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి రాంనగర్ డివిజన్ రిసాలలో పాదయాత్ర నిర్వహించారు. బస్తీల్లో నేరుగా ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వాహబ్, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రావులపాటి మోజస్, నాయకులు ముక్తార్ హుస్సేన్, ఎజాజ్ హుస్సేన్, అలందార్ హుస్సేన్, ముచ్చకుర్తి ప్రభాకర్, దామోదర్రెడ్డి, కొండ మడుగు మధు, తులసి, శ్రవంతి పాల్గొన్నారు.
ప్రైవేటు కుక్కల దవాఖానను తొలించాలి ..
కవాడిగూడ : కవాడిగూడ డివిజన్లోని మైసమ్మబండ, బండానగర్లో జనావాసాల మధ్య ఉన్న ప్రైవేట్గా కుక్కల దవాఖానను వెంటనే తొలించాలని బండానగర్ యూత్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దొబ్బ శ్రీను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు గురువారం కవాడిగూడలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైసమ్మబండ, బండానగర్ బస్తీలకు వెళ్లే మార్గం మధ్యలో ఇటీవల కుక్కల దవాఖానను ఏర్పాటు చేశారని అన్నారు. కుక్కలకు ఆపరేషన్లు, వివిధ వైద్య చికిత్సలు చేసి వ్యర్థాలు రోడ్లపైనే పడేస్తున్నారని, దీంతో దుర్వాసనతో బస్తీవాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈయనతో పాటు బస్తీ వాసులు కే సుదర్శన్, రవి, ఆళ్ల శ్రీను, నరేశ్, రాజేశ్, కే వినోద, తారాబాయి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి..
సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అభివృద్ధి పనులను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీలో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పలువురు నాయకులతో కలిసి పరిశీలించారు. టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, గుండా ఉమాకాంత్ ముదిరాజ్, గోవింద్రాజ్, కేఎం సాయి, ప్రవీణ్, చాంద్పాష తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం
చిక్కడపల్లి : నియోజకవర్గం పరిధిలోని దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఇన్చార్జి ఈఓగా పి.లక్ష్మారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ప్రసిద్ధ్ది గాంచిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం అభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పారు. కాగా ఇదివరకు ఈవో విధులు నిర్వహించిన దీప్తి రెడ్డి లాంగ్ లీవ్ తీసుకోవడంతో దేవాదాయ శాఖ ఇన్చార్జి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, అర్చకుడు కాశీనాధ్ శర్మ, రాజు, వెకంటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.