ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 30: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్కు వస్తున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు. గురువారం సమావేశంలో మాట్లాడుతూ రాష్ర్టానికి అన్ని రకాలుగా మోసం చేసిన ఘనత బీజేపీదేనని ధ్వజమెత్తారు. కుటిల రాజకీయాలు, అధికార దాహంతోనే హైదరాబాద్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలు, మతాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరలేపిన బీజేపీ నాయకులు.. దానిని ఇప్పుడు మరో మెట్టు ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో ఏనాడూ పట్టించుకోని బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణపై ప్రేమ తన్నుకువస్తున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రారంభించాల్సిన గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను తరలించుకుపోయారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినా చెవికెక్కించుకోలేదని గుర్తు చేశారు.