వెంగళరావునగర్, జూన్ 30: జీవితంలో నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ సిదార్థనగర్ కమ్యూనిటీ హాల్లో అలింకో సంస్థ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా దివ్యాంగులు, వినికిడి లోపంతో బాధపడే అభాగ్యులకు సాయం అందించేందుకు గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం పింఛన్ ఇస్తున్నదని పేర్కొన్నారు. అయితే, దివ్యాంగులు, వినికిడి లోపంతో ఉండే అభాగ్యులు ఎవరిపై కూడా ఆధారపడకుండా స్వశక్తితో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరముందన్నారు. కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలను అమర్చుకోవాలని జీవితాలను మార్చుకోవాలని సూచించారు. టాస్క్ సంస్థ ఇలాంటి వారికోసం ఉచిత శిక్షణ ఇస్తుందని, అక్కడ శిక్షణ పొందాక ఉపాధి మార్గాలను అన్వేషించుకోవాలని పేర్కొన్నారు.
వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య మాట్లాడుతూ విధికి ఎదురీది జీవితాలను మార్చుకోవాలనే కసి దివ్యాంగుల్లో ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 200 మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారందరికీ కావాల్సిన సాయాన్ని త్వరలోనే అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బల్దియా యూసుఫ్గూడ సర్కిల్ ఉప కమిషనర్ రమేశ్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణు జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్, నాయకులు సత్యనారాయణ, పవన్ ముదిరాజ్ పాల్గొన్నారు.