ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. బియ్యం, గోధుమలు, చక్కెర, గ్యాస్ను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి దొరికిన వారు మరలా పట్టుబడితే పీడీ యాక్ట్ విధిస్తున్నారు. అవసరం ఉంటేనే రేషన్ సరుకులు తీసుకోవాలని, లేదంటే తీసుకోవద్దని సూచిస్తున్నారు. రేషన్ డీలర్లు ఎవరైనా రేషన్ తీసుకోకపోతే కార్డు తొలగించబడుతుందని చెబితే నమ్మవద్దన్నారు. అలాంటి ప్రచారం చేసే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకు ప్రభుత్వం సబ్సిడీపై నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నది. సబ్సిడీపై ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై నగర పోలీసులు పీడీయాక్టు ప్రయోగిస్తున్నారు. పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరు తమ బుద్ది మార్చుకోవడం లేదు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు అక్రమార్కులపై 55 కేసులు నమోదు చేశారు.
లబ్ధిదారులు విక్రయిస్తే కేసులు
ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు అమ్ముకుంటుండగా, మరికొందరు రేషన్ దుకాణ డీలర్లు అక్రమాలకు పాల్పడుతూ బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై పౌరసరఫరాల శాఖ నిఘా పెంచి చర్యలు తీసుకుంటున్నది. గతంలో రేషన్ బియ్యం అక్రమ దందాలు చేస్తూ పట్టుబడి, మరోసారి అదే దందాను నిర్వహించే అక్రమార్కులపై పీడీయాక్టు విధిస్తున్నారు. ఇదిలా ఉండగా రేషన్ బియ్యం అవసరమైతేనే లబ్ధిదారులు తీసుకోవాలని, అవసరం లేకున్నా వాటిని తీసుకొని బయట విక్రయించడం నేరమని అధికారులు సూచిస్తున్నారు. అక్రమార్కులు పట్టుబడిన సమయంలో విక్రయించిన లబ్ధిదారుల పేర్లు బయటకు వస్తే వాళ్లపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తూ, కార్డు కట్ అవుతుందనే భయాన్ని సృష్టిస్తూ, బలవంతంగా రేషన్ అంటగట్టి బయట విక్రయించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక నెల రేషన్ తీసుకోకపోతే కార్డు కట్ కాదనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లబ్ధిదారులు ఆందోళనకు గురికాకుండా సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా(ఇన్చార్జి), పౌరసరఫరాల అధికారి తనుజా సూచించారు.
రూ.8 నుంచి 23కు విక్రయం
ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బి య్యాన్ని కొందరు లబ్ధిదారులు బయట మార్కెట్లో రూ.8 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. వాటిని కొంతమంది దళారులు రూ.15 నుంచి రూ.17 వరకు ఏజెంట్కు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి సుమారు రూ.20 నుంచి రూ.23 ధరతో ప్రధాన ఏజెంట్లకు చేరుతున్నా యి. ఈ విక్రయాలపై జిల్లా పౌరసరఫరాల అధికారులకు ప్రతి నెల 30 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్న లబ్ధిదారులపై కూడా పౌర సరఫరాల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. గృహ అవసరాల కోసం ప్రభుత్వం అందించే డొమెస్టిక్ సిలిండర్లను కొందరు వాణిజ్య అవసరాలకు వాడుతున్నారు. ఇందులో 16 కేసులు నమోదు చేసి 135 పెద్ద సిలిండర్లను, 16 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో 6,36,610 కుటుంబాలకు కార్డులు
హైదరాబాద్ జిల్లా పరిధిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 6,36,610 కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉండగా.., ఇందులో అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులపై ఆయా కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి నెలవారీగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రేషన్ పోర్టబులిటీ రావడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం హైదరాబాద్లో రేషన్ తీసుకుంటున్నారు.