శేరి లింగంపల్లి, జూన్ 23: జనాభాలో 15 శాతం మంది దివ్యాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడిపేందుకు సహాయపడేలా రోబోల తయారీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జి(టాస్క్) సీఈఓ శంతను సిన్హా అన్నారు. గచ్చిబౌలిలోని టీ హబ్లో గురువారం హెచ్ ల్యాబ్స్ అధ్వర్యంలో ఏర్పాటైన హెచ్ బోట్స్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధమాన టెక్నాలజీ నగరంగా హైదరాబాద్ అంతర్జాతీయ స్ధాయిలో ఎంతో పురోగతి సాధిస్తున్నదని అన్నారు.
బెంగుళూరు నగరం ఐటీ నగరమైనప్పటికీ మనం మరో అడుగు ముందున్నామని, అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఆధారిత నగరంగా పేరొందిందని అన్నారు. రాష్ట్ర టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం మాట్లాడుతూ యువత వినూత్న ఆలోచనలతో కూడిన ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి సారించి తమ పరిశోధనలు విస్తృతం చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 7.5 బిలియన్ల జనాభా కేవలం 1000 మంది వ్యక్తులచే ప్రభావితం అవుతుందని అన్నారు. హెచ్ బోట్స్ వ్యవస్థాపకులు కిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ అనంతరం, అనేక రోబోటిక్స్ కంపెనీలు రోబోలను తయారు చేయడానికి చైనాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాల వైపు ఎదురుచూస్తున్నారన్నారు.
హెచ్ బోట్స్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని యూకే, యూఎస్ఏ దేశాల్లోని తమ ైక్లెంట్ల కోసం పెద్ద మొత్తంలో రోబోట్స్ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో 140 రోబోట్స్ను తయారు చేశామని, వచ్చే ఎడాదిలో 2500 రోబోలను తమ ైక్లెంట్స్ కోసం సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీస్ కోసం 500 డెలివరీ రోబోలను త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 కళాశాలల్లో హెచ్ బోట్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్పై పరిశోధన, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయడానికి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.