హిమాయత్నగర్, జూన్ 23: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పిన మాటలను ప్రధానమంత్రి మోడీ విస్మరించారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు. హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుతో దోచుకున్న వారిని రక్షించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు.
జాతీయ బ్యాంకులలోనే ప్రజా ధనానికి రక్షణ లేకుండా పోతే ప్రైవేట్ బ్యాంకులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మోడీ పరోక్షంగా బ్యాంకులను దోచుకునే వారికే సహకరిస్తున్నట్లుగా పరిస్థితులు కన్పిస్తున్నాయని ఆరోపించారు. ముంబైలోని యూనియన్ బ్యాంకును 34 వేల కోట్లతో మోసం చేసిన డీహెచ్ఎఫ్ఎల్ సంస్థపై చర్యలు తీసుకుని రూ.34 వేల కోట్లను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.